రజనీకాంత్ పైన ఒత్తిడి: 'జయలలిత' శూన్యత భర్తీ చేస్తారా, రజనీ స్థానికుడు కాదా?
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో రజనీకాంత్ రాజకీయ వేడి రాజుకుంది.
చెన్నై: జయలలిత మృతి అనంతరం తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతికి వచ్చాయి. దీపా జయకుమార్, ఆ తర్వాత ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ రంగంలోకి రావడం, డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేతికి రావడం జరిగిపోయాయి.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో రజనీకాంత్ రాజకీయ వేడి రాజుకుంది. అసలు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అనే చర్చ సాగుతోంది. అయితే, ఆయన రాకపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉందని భావిస్తున్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై శరత్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన రజనీకాంత్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో రజనీకాంత్ పైన చర్చ సాగుతోంది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు మొదలు జాతీయ పార్టీల వరకు ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి గతంలో పలు ప్రయత్నాలూ చేశాయి.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ సైతం రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. కానీ ఆయన మాత్రం ఎప్పటికప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు, బహిరంగ మద్దతుకు దూరంగానే ఉంటున్నారు. రాజకీయప్రవేశం విషయంలో రజనీకాంత్ ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్నారు.
అదే సమయంలో, తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జయలలిత మృతితో రాష్ట్ర రాజకీయాల్లో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ రజనీకాంత్ అంశం రాజకీయ తెర పైకి వచ్చింది.
తమిళనాడుకు ఆయన అవసరముందని, ఇదే విషయాన్ని చో రామస్వామి పలుమార్లు పేర్కొన్నట్లు తుగ్లక్ పత్రిక సంపాదకుడు ఎస్ గురుమూర్తి ఇటీవల ప్రస్తావించారు. దానిపై శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రగడకు దారి తీశాయి.
రజనీ అభిమానులు తన దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, తనకు వ్యతిరేకంగా ర్యాలీలు తీయడంతో శరత్ కుమార్ తిగి వచ్చారు. తాను రజనీకాంత్ను విమర్శించలేదని, ఆయన తనకు మంచి మిత్రుడని తెలిపారు. తమిళనాడును తమిళులే పరిపాలించాలన్నది తన అభిమతమన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తొలి రాజకీయ ప్రత్యర్థి మాత్రం తానేనని చెప్పారు. శరత్ కుమార్ వ్యాఖ్యలతో.. రజనీకాంత్ స్థానికుడు కాదన్న వాదన తెరపైకి వచ్చింది.
జయలలిత మృతితో ప్రస్తుతం రాజకీయ శూన్యం ఏర్పడినట్టు చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికి పలు రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అందులో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. ప్రధానంగా బీజేపీ.. ప్రజాకర్షణ కలిగిన కొందర్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రజనీకాంత్ మద్దతు కోసం బీజేపీ జాతీయ నేతలు పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది.
అలాగే రజనీకాంత్ ద్వారా మరింత లబ్ధి పొందడానికి ప్రాంతీయ పార్టీలు సైతం ప్రయత్నిస్తున్నాయి. ఒకవిధంగా రజనీపై రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. అభిమానులు సైతం ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. జయలలితతో ఏర్పడిన శూన్యత రజనీకాంత్ ద్వారా తీరుతుందని చాలామంది భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications