చిరంజీవి లేఖను విసిరికొట్టిన కిరణ్ రెడ్డి?
గంటా శ్రీనివాస రావు అందించిన లేఖను తీసుకుని ముఖ్యమంత్రి పట్టరాని ఆగ్రహంతో విసిరికొట్టారని చెబుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చిరంజీవి పదే పదే మీడియాతో మాట్లాడడంతో కిరణ్ కుమార్ రెడ్డి అరికాలి మంట నెత్తికెక్కిందట. చిరంజీవిపై కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమైనట్లు కూడా చెబుతున్నారు.
వచ్చే పది రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఏప్రిల్ 7వ తేదీన ముఖ్యమంత్రులు, న్యాయమూర్తుల సమావేశం ఉంది. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్సిటిసి)పై ఏప్రిల్ 15వ తేదీన ముఖ్యమంత్రులు సమావేశం ఉంది. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినప్పుడు చిరంజీవిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెుబుతున్నారు. ఈ రెండు విడతల్లో ఎప్పుడైనా కిరణ్ కుమార్ రెడ్డి ఆ పని చేయవచ్చునని అంటున్నారు.
విద్యుచ్ఛక్తి చార్జీల పెంపు విషయంలో గత ప్రజారాజ్యం పార్టీ నాయకులు తప్ప దాదాపుగా కాంగ్రెసు నాయకులంతా ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. చిరంజీవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తూ పోవడాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్కు చిరంజీవి లేఖ రాయడాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.