కేశవరావు ఎపి ఎంపి: చంద్రబాబు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. యాధృచ్ఛికంగా రాజ్యసభ సభ్యుల కేటాయింపులో కేశవరావు సీమాంధ్ర కోటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సివచ్చింది.
కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టడానికి చర్చకు రావాలంటూ తెరాస సెక్రటరీ జనరల్ కూడా అయిన కె.కేశరరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు.
కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు ఇలా సమావేశం ఏర్పాటు చేయడం పరిపాటి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహించే సమావేశానికి సీమాంధ్రకు చెందిన ఎంపీగా కేశవరావుకు ఆహ్వానం అందింది.
చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించడమా, కాదనడమా అనే సంకటస్థితిలో కేశవరావు పడ్డారని చెప్పవచ్చు. అయితే, చంద్రబాబు ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను తెలంగాణ వాడినని, అంతే కాకుండా తెరాసలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నానని, సీమాంధ్ర సమావేశానికి రాలేనని కేశవరావు చంద్రబాబుకు చెప్పారట.