టి లిస్ట్పై కెవిపి లాబీయింగ్: ఆధిపత్యంపై నేతల గుర్రు
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు తెలంగాణ ప్రాంతంలో ఇంకా తన ప్రాబల్యాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కన్నెర్ర చేస్తున్నారట. తెలంగాణకు సంబంధించి అధిష్టానం ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. అయితే, ఈ లిస్టులో కొందరు అభ్యర్థులను ఆయన ప్రతిపాదించారట.
దానిని అధిష్టానం ఏ మేరకు పరిగణలోకి తీసుకున్నదనే విషయాన్ని పక్కన పెడితే.. కెవిపి జోక్యంపై తెలంగాణ నేతలు ఆగ్రహంతో ఉన్నారట. కొన్ని నియోజకవర్గాలకు కెవిపి కొందరు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించారని, వాటిని ఆమోదించాలంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్కు సూచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలోని సీట్లపై ఇంకా కెవిపి లాబియింగ్ ఆంతర్యం ఏమిటంటూ వారు మండిపడుతున్నారు. తెలంగాణ అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం శనివారం ప్రకటిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఆశావహులు ఢిల్లీలో కెవిపి ఇంటికి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పలువురి అభ్యర్థిత్వాలను స్థానిక నేతలు వ్యతిరేకిస్తుండగా.. వారికి కెవిపి మద్దతుగా నిలబడ్డారని చెబుతున్నారు. కెవిపి తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో ఆయా అభ్యర్థుల తరఫున లాబీయింగ్ చేసి ఉంటారని అంటున్నారు. దీనిని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.