క్యురేటర్ దల్జీత్ సింగ్ కాళ్లు పట్టుకున్న విరాట్ కోహ్లీ
మొహాలీ: భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యురేటర్ కాళ్లు పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ తన బ్యాట్తో సత్తా చాటుతున్నాడు. తద్వారా టెస్ట్ కెప్టెన్గా నిలిచాడు. వన్డే, టీ ట్వంటీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి త్వరలో పగ్గాలు తీసుకునే రేసులో కోహ్లీయే ముందున్నాడు.
కోహ్లీ బరిలోకి దిగితే, ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తుతారు. బౌలర్ ఎవరైనా విరుచుకుపడతాడు. తనపై స్లెడ్జింగ్కు దిగే ప్రత్యర్థి జట్ల క్రికెటర్లపై అదే స్థాయిలో ఎదురు సమాధానం చెప్పడంలోనూ అతడికి అతడే సాటి. అదే సమయంలో కోహ్లీకి దూకుడు ఎక్కువ అనే వాదన కూడా ఉంది.
అయితే, అలాంటి కోహ్లీ వినయంలోను తనకు తానే సాటి అని నిరూపించాడు. మొహాలీ పిచ్లోకి అడుగు పెట్టిన కోహ్లీ... పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్కు పాదాభివందనం చేశాడు. దాదాపు 23 ఏళ్లుగా పిచ్ క్యూరేటర్గా ఉన్న దల్జీత్ సింగ్... కోహ్లీని చిన్నతనం నుంచి టెస్టు జట్టు కెప్టెన్గా ఎదిగే దాకా ప్రత్యక్షంగా చూశారు.
ఈ క్రమంలోనే 73 ఏళ్ల దల్జీత్ సింగ్కు కోహ్లీ పాదాభివందనం చేశాడు. ఐదో వన్డే సందర్భంగా ముంబై పిచ్ సరిగా లేదని క్యురేటర్ పైన రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికా - భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.