పొలంలో బయటపడ్డ బంగారం, పరుగులు పెట్టారు
విజయనగరం: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.
సాలూరు డివిజన్ పరిధిలోని పాచిపెంట మండలంలో శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తికి కొంత భూమి ఉంది. దీనిని సాలూరు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి లీజుకు తీసుకుని పంట పండిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో నాట్లు వేసేందుకు భూమిని చదును చేశారు.
అనంతరం కురిసిన వర్షాలకు ఓ యువతికి ఈ పొలంలో ఓ పెట్టె లభ్యమైంది. ఈ పెట్టెలో బంగారు పూసలు, చైన్లు, ఆభరణాలు, నాణేలు కనిపించాయని చెబుతున్నారు. దీంతో వాటిని కడికి ఇంటికి తీసుకు వెళ్లారని అంటున్నారు. ఈ విషయం అంతటా పాకింది.
దీంతో, గ్రామంలోని మరికొందరు ఆ పొలంలోనికి వెళ్లి వెతకగా బంగారు పూసలు, ముక్కుపుడకలు, చైన్లు, మరికొన్ని వెండి ఆభరణాలు దొరికినట్లుగా చెబుతున్నారు. ఇది మండలమంతా తెలిసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి బంగారు నగలు దొరికాయన్న పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. వాటిని ఓ నగల దుకాణంలో అమ్మినట్లు తెలియడంతో విచారిస్తున్నారని తెలుస్తోంది.