కాంగ్రెసుకు దెబ్బ: తెరాసలోకి మాజీ మంత్రి, చక్రం తిప్పిన ఎంపీ
హైదరాబాద్: రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెసుకు హైదరాబాదులో పెద్ద దెబ్బనే తగలబోతోంది. హైదరాబాద్ గోషామహల్ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెసుకు షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు
ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రాజకీయ మలుపుపై నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. గోషా మహల్ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మంత్రిగా పనిచేసిన ముఖేష్
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్గౌడ్ 47 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఒక ఏడాది నుంచి ప్రచారం
గోషామహల్లో ఓటమి చవి చూసిన తర్వాత ముఖేష్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. దాంతో గత సంవత్సర కాలం నుంచి ముఖేష్గౌడ్ తెరాసలో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది.
ఎంపీ రాయబారంతో గ్రీన్ సిగ్నల్...
తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ముఖేష్గౌడ్ను తెరాసలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆ ఎంపీ కేసీఆర్కు నచ్చజెప్పడంతో ముఖేష్గౌడ్ను తెరాసలో చేర్చుకునేందుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
అనుచరులతో ముఖేష్ చర్చలు
హైదరాబాదులోని ఎంజే మార్కెట్లోని తన కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన ముఖేష్గౌడ్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశం అవుతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత, తన ఆలోచనను చెప్పిన తర్వాత తెరాసలో చేరే తేదీని ప్రకటిస్తారని సమాచారం.