బిజెపికి మరో షాక్: కాంగ్రెసులోకి నాగం జనార్దన్ రెడ్డి జంప్?
హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మరో షాక్ తగలనుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బిజెపికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొమ్మూరి ప్రతాప రెడ్డి బిజెపి రాజీనామా చేశారు.
తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెసుల నుంచి ముఖ్యమైన నాయకులు కొంత మంది తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెసులో చేరుతారని అంటున్నారు.
ఇటీవల నాగంను సంప్రదించారు...
ఇటీవల కాంగ్రెసు నాయకులు కొంత మంది నాగం జనార్దన్ రెడ్డిని సంప్రదించి, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎదుర్కోవడానికి కాంగ్రెసులో చేరడమే మంచిదని నాగం భావిస్తున్నట్లు సమాచారం.
అనుచరులతో నాగం సంప్రదింపులు...
నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల తన అనుచరులతో సమావేశమయ్యారు. నాగర్ కర్నూలుకు చెందిన తన ముఖ్య అనుచరులతో ఆయన తన ఉద్దేశ్యాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు.
కొద్ది రోజులు ఆగాలని చెప్పారు..
మరో మూడు నెలలు ఆగాలని అప్పట్లో తన అనుచరులకు నాగం జనార్దన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెసులో చేరడానికి ముందు మరోసారి కలుస్తానని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. బిజెపిలో తగిన ప్రాధాన్యం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోనే ఆయన పార్టీ మారాలని అనుకుంటున్నారని సమాచారం.
గత ఎన్నికల్లో ఓడిపోయారు...
2014 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్ నగర్ లోకసభ సీటుకు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసి పార్టీ పరిస్థితి గురించి వివరించారు. తెరాసకు ధీటైన ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగకపోవడానికి గల కారణాలను కూడా వివరించినట్లు తెలస్తోంది. అయినప్పటికీ పార్టీలో మార్పేమీ కనిపించకపోవడంతో ఆయన విసుగు చెందినట్లు చెబుతున్నారు.