రావణ వధ తర్వాత విభీషణుడికి రాముడు ఇచ్చిన బహుమతి ఇదే..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు - తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
శ్రీ రంగం అంటే శ్రీ రంగనాధుని నామస్మరణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది . పాలకడలి నుండి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీ రంగం . సమున్నత గోపురాలతో విశాల ప్రాకారాలతో 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొనివుంది. కోయిల్ అంటే శ్రీరంగం , మలై అంటే తిరుమల అంటారు. శ్రీ రంగాన్ని పెరియకోయిల్ అని కూడా అంటారు. దీనర్థం పెద్ద దేవాలయం అని . శ్రీ రంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం అంటారు.
కంబోడియాలోని అంగ్కార్వాట్ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అయితే అది పర్యాటక స్థలం మాత్రమే దీంతో నిత్యం పూజలందుకుంటున్న క్షేత్రాల్లో శ్రీరంగమే పెద్దది . శ్రీ రంగనాథుడిని దర్శించినంతనే మనకు సాక్షాత్తు ఆ శేషసాయిని దర్శించున్న దివ్యానుభూతి కలుగుతుంది. వేల సంవత్సరాలుగా కోట్లాది భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్న శ్రీ రంగ పుణ్యక్షేత్ర సందర్శన మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది.
విభీషణుడికి రాముడు ఇచ్చిన విగ్రహం. సీతా అపహరణం తరువాత అగ్రజుడైన రావణుడికి అతని సోదరుడు విభీషణుడు పలు హితవచనాలు చెబుతాడు . స్త్రీలను అపహరించడం తగదని హితవు పలుకుతాడు. అయితే రావణుడు ఈ మాటలను పెడచెవిన పెడ్తాడు . దీంతో విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతాడు. రావణ వధ తర్వాత విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రంగనాధుడి విగ్రహాన్ని అతనికిస్తాడు . లంకకు వెళ్లే సమయంలో ఎక్కడా నేల మీద పెట్టకూడదని షరతు విధిస్తాడు. లంకకు వెళుతున్న విభీషణుడు కావేరి దాని ఉపనది మధ్యలో వున్న ద్వీపంలో కాసేపు విశ్రమించేందుకు భూమిపై విగ్రహాన్ని పేడతాడు .
తిరిగి వెళ్లే సమయంలో విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా విగ్రహం రాలేదు . ఆ ప్రదేశాన్ని పాలించిన ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చుతాడు . స్వామి వారు కూడా అక్కడే వుండేందుకు ఇష్టపడటంతో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు . విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కునకు తిరుగుతారు.
ప్రధాన ఆలయంలో స్వామివారు శయనమూర్తిగా వుంటారు . క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు అదే భంగిమలో ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడం విశేషం . మహావిష్ణువు నాభి నుండి పద్మంలో జన్మించిన బ్రహ్మ ఇక్కడ కనపడరు . దీనర్థం సూర్యోదయానికి ముందే బ్రహ్మదేవుడే స్వామి వారిని పూజిస్తారని క్షేత్రగాధ వెల్లడిస్తోంది . విశిష్టాద్వైత సిద్ధాంత కర్త శ్రీ రామానుజాచార్యులు శ్రీ రంగంలోనే అనేక సంవత్సరాలు వుండి స్వామి సేవలో పాల్గొన్నారు.
లౌకికవాదానికి ప్రతీక , డిల్లీ సుల్తాన్ కాలంలో ఇక్కడ మూర్తిని డిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది . అక్కడ సుల్తాన్ కుమార్తె స్వామి భక్తురాలిగా మారింది . అనంతరం ఆ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ రంగానికి తీసుకువస్తారు . సుల్తాన్ కుమార్తె తన విశేష భక్తితో స్వామివారిలో ఐక్యమైంది . ఇప్పటికీ ఆ ఘటనకు ప్రతీకగా పౌర్ణమి , ఏకాదశి సమయాల్లో స్వామివారు లుంగీ ధారణలో కనిపిస్తారు . నివేదనగా రోటీని సమర్పిస్తారు .
ఏడు ప్రాకారాలు , శ్రీ రంగనాధుని ఆలయంలో మొత్తం ఏడు ప్రాకారాలు , 21 గోపురాలు వున్నాయి . ఒక్కో ప్రాకారంలో పలు ఆలయాలు నెలకొనివున్నాయి . శ్రీ రంగనాధునికి ఏడాదిలో మూడు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . చిత్తిరై ( ఏప్రిల్ - మే ) తాయ్ ( జనవరి - ఫిబ్రవరి ) పంగుణి ( మార్చి - ఏప్రిల్ ) ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అనుంగుభక్తుడు గరుడాళ్వర్కు ప్రత్యేకమైన మందిరం వుంది. సాగర మథనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ధన్వంతరికి కూడా ఒక మందిరం వుండటం విశేషం. మాతృ మూర్తి రంగనాయకి తాయర్తో పాటు శ్రీదేవి , భూదేవిలు కూడా ఆలయంలో భక్తులను ఆశీర్వదిస్తుంటారు.
శ్రీ రంగం చూడాలి అనుకునేవారు ఇలా చేరుకోవచ్చు :-
* శ్రీ రంగం సమీపంలోని రైల్వే స్టేషన్ తిరుచినాపల్లి . ఇక్కడ నుండి శ్రీరంగం 9 కి.మీ.దూరంలో వుంది.
* దేశంలోని పలు ప్రాంతాల నుండి శ్రీరంగానికి రహదారి సౌకర్యముంది.
* తిరుచినాపల్లి విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా శ్రీ రంగం చేరుకోవచ్చును .