అష్టైశ్వర్యాలు కలగడానికి కార్తీకమాసంలో ఏం చేయాలంటే..
కార్తీక మాసంలో ఆ నెల మొత్తం కస్తూరి, గంధము, పంచామృతములతో శ్రీహరికి స్నానము చేయించినవారు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొంది చివరకు పరమ పదాన్ని పొందుతారు.
సాయంత్రం సమయంలో హరిసన్నిధిలో దీపదానము చేసేవారు విష్ణులోకమును పొందుతారు. ఈ నెలమొత్తం దీపదానము చేస్తే జ్ఞానాన్ని పొంది విష్ణులోకమునకు చేరుకుంటారు.
ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి, వత్తిని చేసి, బియ్యపుపిండితోకానీ, గోధుమపిండితో కానీ పాత్రను చేసి ఆవు నెయ్యిని పోయాలి. వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వాలి. ఇలా నెలమొత్తం చేసి చివరలో వెండితో పాత్రను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించాలి. ఆ తర్వాత బ్రాహ్మణునికి భోజనము పెట్టి స్వయంగా ఈ మంత్రం చెబుతూ ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి.
మంత్రం
సర్వజ్ఞానప్రదం
దీపం
సర్వ
సంపచ్ఛుభావహం!
దీపదానం
ప్రదాస్యామి
శాంతిరస్తు
సదా
మమ!!*
దీపము సర్వజ్ఞానదాయకమని, సమస్త సంపత్ప్రదాయకమని, అందువల్ల తానిప్పుడు దీపదానమును చేయుచున్నానని, దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక అనేది దీని అర్థం. ఇలా చేస్తే అనంత ఫలం మన సొంతమవుతుంది. దీపమును పెట్టినవారు విద్యను, శాస్త్ర ఫలాన్ని, ఆయుష్షును, స్వర్గాన్ని, సమస్త సంపదలను పొందుతారు. దీపదానం వల్ల మనో వాక్కాయ కర్మల వల్ల తెలిసి చేసినాకానీ, తెలియక చేసినాకానీ పాపాలన్నీ నశించిపోతాయి. ఈ విషయాన్ని పరమ శివుడు చెప్పాడు.
కార్తీక మాసం శివ కేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. అందుకే అన్ని శివాలయాలు, వైష్ణవాలయాలు దైవనామ స్మరణతో మార్మోగుతాయి. వీలున్నప్పుడల్లా వీటిని సందర్శిస్తుండాలి. విష్ణువుకు తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిస పువ్వు , గరిక, దర్బలను, శివుడికి బిల్వ దళాలు, జిల్లేడు పూలను ఇవ్వాలి. ఒక పాత్రలో బియ్యం, ఉసిరికాయ వంటి వస్తువులతో కూడిన దీపాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఈ మాసంలో సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.