వైయస్ తెలంగాణ కమిటీ గుట్టు
సభా కమిటీ అయితేనే దానికి దూరంగా ఉండాలనుకున్న మహాకూటమి సభ్యులు తాజా పరిణామంతో మండి పడుతున్నారు. తాము అందులో సభ్యులుగా ఉండదలచుకోలేదని తేల్చిచెప్పారు. కమిటీ గురించి సభలో శుక్రవారం ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత కూడా శాసనసభ స్పీకర్ కె.ఆర్.సురేష్రెడ్డి విలేఖరులతో దాని గురించి మాట్లాడారు కూడా. ప్రభుత్వం నుంచి లేఖ వస్తుందని దీనిమేరకు స్పందిస్తామని చెప్పారు. కమిటీకి ఛైర్మన్గా తాను లేదా మండలి ఛైర్మన్ ఉండరని సీనియర్ సభ్యుడు ఉంటారని అన్నారు. కమిటీ నివేదికను తనకు ఇస్తుందని, దీన్ని ప్రభుత్వానికి అందచేస్తానని స్పీకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఆ రోజు విలేకరులతో మాట్లాడుతూ, సభ్యులెవరు, విధివిధానాలేమిటనేది ప్రభుత్వం, స్పీకర్ కలసి నిర్ణయిస్తారని ప్రకటించారు. సభా సంయుక్త కమిటీ అయితే అది చేసే తీర్మానాలకు విలువ ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికకు శాసనసభలో శాశ్వత స్థానం ఉంటుంది. ప్రభుత్వం తనంత తానుగా ఏర్పాటుచేసిన సభాసంఘం కాబట్టి అదిచేసే సిఫారసులకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా స్పందించాల్సి ఉంటుంది.
అత్యంత కీలకమైన తెలంగాణ అంశంపై అఖిల పక్షాన్ని వేసి, హడావుడిచేసి చేతులు దులుపుకోవడం తప్ప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని మహాకూటమి ధ్వజమెత్తింది. ఈ విషయమై మంగళవారం తెదేపా అధినేత చంద్రబాబు వామపక్ష నేతలు రాఘవులు, నారాయణలతో ఫోన్లో మాట్లాడారు. ఈ కమిటీలో పాలు పంచుకోదలుచుకోలేదని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. ఈ మేరకుతాము కూడా లేఖ రాస్తామన్నారు.