ఈ తానా బంధమానిటిదే: ప్యాట్ క్వీన్
చికాగో: ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక దేశాలయిన భారత్, అమెరికాల మధ్య విడదీయరాని సంబంధాలు ఏర్పడ్డాయని, ప్రపంచ దేశాలకు అమెరికా, భారత్ లు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఇల్లినాయుస్ గవర్నర్ ప్యాట్ క్విన్ వెల్లడించారు. గురువారం రాత్రి చికాగోలో 17వ తానా మహాసభలను ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, కూచిపూడి, భరత నాట్యం వంటి కళలకు పుట్టినిల్లని ఆయన ప్రశంసించారు. అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం వివిధ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, చికాగోలో తానా మహాసభలు నిర్వహించటం సంతోషదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. అబ్రహాం లింకన్ వంటి మహనీయుడు జన్మించిన చారిత్రాత్మకమయిన చికాగో నగరంలో తెలుగువారు మంచి ప్రతిభా పాటవాలు చూపుతున్నారని ప్యాట్ క్విన్ తెలిపారు. ఇల్లినాయిస్ ప్రజల తరపున తెలుగు ప్రజలకు అభినందనలు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటయిన చికాగో నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 17వ మహాసభలు గురువారం రాత్రి కోలాహలంగా, కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రోస్మాంట్ కన్వెన్షన్ సెంటరులో ముందుగా నిర్వహించిన బ్యాంక్వెట్(విందు) సమావేశానికి అమెరికా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారికి అవార్డులను అందజేశారు. సినీనటుడు మురళీమోహన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగిస్తూ అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో సమైక్యంగా ఉండి రాష్ట్రంలో అభివ్రుధ్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తానా అధ్యక్షుడు కాకరాల ప్రభాకర చౌదరి స్వాగతం పలికారు. వివిధ రంగాల్లో ప్రముఖులయిన రాష్ట్రానికి చెందిన మంత్రులు గల్లా అరుణకుమారి, మోపిదేవి వెంకటరమణ, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు, గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.గోపాలక్రిష్ణ, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పరుచూరి గోపాలక్రిష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయిక్, సినీనటులు ఎవీఎస్, రఘుబాబు, మహర్షి, నవనీత్ కౌర్, రజిత, కామ్న జఠ్మలాని, గాయకులు మనో, విజయలక్ష్మీ, సునీత, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి తదితరులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.