చిరంజీవిపై పోలీసు స్టేషన్ లో ఒయు జెఎసి ఫిర్యాదు
శోభారాణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొంటూ ఆమెపై కూడా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 24 గంటల్లోగా ఆధారాలతో రుజువు చేయాలని, లేకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ చిరంజీవిని హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఐదు గంటలతో ఓయూ జేఏసీ విధించిన గడువు ముగిసింది. దీంతో జేఏసీ నేతలు చిరంజీవిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై చేసిన ఆరోపణలను చిరంజీవి, శోభారాణి రుజువు చేయాలని, లేకపోతే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రకటనల ద్వారా వారు తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ నేతలు అంజన్న, భాస్కర్, రవీంద్రనాయక్, క్రిషాంక్, అంబేద్కర్, దరువు ఎల్లన్న, రాజేష్, రవి నాయక్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా చిరంజీవి, శోభారాణి వ్యాఖ్యానించారని, తమ పరువుకు భంగం కలిగించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారని ఉస్మానియా వర్సిటీ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. ఫిర్యాదును స్వీకరించామని, కానీ కేసును నమోదు చేయలేదని చెప్పారు. ఇది పరువుకు సంబంధించిన అంశమని, దీనిని న్యాయస్థానంలోనే చూసుకోవాలని వివరించారు. ఫిర్యాదుదారులు చేస్తున్న ఆరోపణలు తమ పరిధిలో జరగలేదని, ఇది పూర్తిగా సివిల్ వివాదమని చెప్పారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.