పోలీసు తుపాకీ పేలి ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలు బలి
విద్యార్థులు మృతిచెందిన విషయం తెలియగానే కానిస్టేబుల్ శ్రీనివాసరావు అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. సహోద్యోగులైన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు పెద్దఎత్తున పోలీసు స్టేషన్కు వచ్చి విద్యార్థి మృతదేహాన్ని స్టేషన్ ఎదురుగా ఉంచి రాస్తోరోకో చేశారు. ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్ శ్రీనివాస్రావుపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం ఎస్పీ క్రాంతిరాణా తెలిపారు. పర్యవేక్షణ లోపానికి బాధ్యుడైన ఎస్ఐని సస్పెండ్ చేశామన్నారు. ఈ దుర్ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించామని, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.25 వేలు చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్టు ఖమ్మం కలెక్టర్ తెలిపారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యం కారణంగానే తుపాకీ పేలిందని, సంబంధిత కానిస్టేబుల్పై ఇప్పటికే కేసు నమోదు చేశామని డీజీపీ అరవిందరావు స్పష్టం చేశారు. అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. ప్రదర్శనకు పెట్టే ఆయుధాల్లో తూటాలు లోడ్ చేయకూడదని, ఇక్కడ మాత్రం లోడ్ చేసి ఉన్న తుపాకులే పెట్టారని, అది ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.