దుమ్ముంటే అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కండి: కిరణ్ కుమార్కు పిల్లి సవాల్
కాంగ్రెసు శాసనసభ్యులంతా రాజీనామా చేస్తే జగన్ వెంట వెళ్తున్న తామంతా రాజీనామా చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు శాసనసభ్యులంతా వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకుని గెలిచారని ఆయన అన్నారు. రాజీనామాలు చేయకపోతే శానససభలో విశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. తాము వైయస్ రాజశేఖర రెడ్డి విధేయులమని ఆయన చెప్పారు. తాము జగన్ వెంట ఉండకపోతే ప్రజలు తమను క్షమించబోరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించే ఉద్దేశం గానీ అలవాటు గానీ తమకు లేదని ఆయన అన్నారు. పివి నరసింహారావు అపాయింట్మెంట్ తాను ఇప్పించానని కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. వైయస్కు ప్రధాని అపాయింట్మెంటో, మరెవరి అపాయింట్మెంటో మరొకరు ఇప్పించాల్సిన స్థితిలో లేరని, దేశ ముఖ్య నాయకులందరికీ వైయస్ తెలుసునని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాము జగన్ వెంట వెళ్లడం లేదని ఆయన చెప్పారు. తమను కావాలని కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చగొడుతున్నారని శాసనసభ్యుడు బాబూ రావు అన్నారు. దమ్ముంటే విశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని సవాల్ చేశారు. విశ్వాస తీర్మానం పెడితే కూలిపోతుందో లేదో తెలుస్తుందని, తాము ప్రభుత్వాన్ని కూల్చదలచలేదని అన్నారు. ప్రభుత్వం కూలిపోతుందా అని అడిగితే ఆయన ఆ విధంగా అన్నారు. తమను రాజీనామా చేయమంటున్నారని, అందువల్లనే విశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. ప్రజల్లోకి వెళ్తే ఎవరేమిటో తేలుతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోక ముందే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని పిలిపించుకుని మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పడం నైతికమా అని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు.
వైయస్ కూడా చిరంజీవితో స్నేహానికి పూనుకున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అంటే, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని వైయస్ చిరంజీవికి చెప్పాడా అని ఆయన అడిగారు. చిరంజీవిని ఆహ్వానించడం వల్లనే కలత చెంది జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆయ అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతివ్వాలని ఆ రోజు చిరంజీవిని అడిగారని గుర్తు చేయగా అందులో జగన్ ప్రమేయం లేదని, అది వ్యక్తిగతంగా చేసిన పని అని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ పెట్టడం ఖాయమని, ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ ఈ ప్రభుత్వాన్ని కూల్చవద్దని చెప్పారు కాబట్టి ఇంకా కొనసాగుతున్నామని, తమ నాయకుడి మాటలనే తాము వింటామని ఆయన చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ ప్రభాకర రావు డిమాండ్ చేశారు. తాము 14 పాయింట్లతో కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి నేరుగా అడగవచ్చునని, దొడ్డిదారిన హైకోర్టు ద్వారా సిబిఐ విచారణకు ముందుకు పోతున్నారని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించలేదని బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. మార్చిలోనే జగన్ పార్టీ ప్రారంభమవుతుందని బాలినేని చెప్పారు. ఎన్నికల కమిషన్ ప్రక్రియ వల్ల జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.