తెలంగాణవ్యాప్తంగా రైల్ రోకో, పలువురు రాజకీయ నేతల అరెస్టు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వేమార్గంపై టైర్లకు నిప్పుబెట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు మౌలాలిలో జరిగిన ఆందోళనలో తెరాసకు చెందిన సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ పాల్గొన్నారు. నాంపల్లిలో ఆందోళనకు దిగిన ఎమ్మెల్సీ దిలీప్కుమార్, విమలక్కతదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ఘట్కేసర్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందర్ని కలుపుకువెళుతామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రైల్రోకో సందర్భంగా దక్షిణమధ్యరైల్వేపరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. జంటనగరాల్లో అన్నీ ఎంఎంటీఎస్ సర్వీసులు, తెలంగాణ ప్రాంతంలో ప్యాసింజర్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రైల్వేవర్గాలు ప్రకటించాయి. సికింద్రాబాద్నుంచి బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్ప్రెస్, శాతవాహన, పల్నాడు, గోల్కోండ, సింహపురి,గౌతమి, షిర్డిసాయినగర్ ఎక్స్ప్రెస్... తదితర సర్వీసులను రద్దు చేశారు. పొద్దునే వివిధప్రాంతాలనుంచి జంటనగరాలకు చేరుకునే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్కు చేరుకునే రైళ్లను ఎక్కడైనా ఆపేస్తే అక్కడ నుంచి ప్రయాణీకులను ఆర్టీసీ బస్సుల్లో వారి గమ్యానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్టను పూర్తిచేశారు.