ఒసామా బిన్ లాడెన్ స్థావరం గురించి పాకిస్తాన్లో తెలుసు: వికీలీక్స్
లాడెన్ ఎక్కడున్నాడో పాక్లో అనేక మందికి తెలుసని వివరించింది. ''పాకిస్థాన్లో లాడెన్ అదృశ్య వ్యక్తి కాదు. ఉత్తర వజీరిస్థాన్లోని ఆయన అనుపానులు చాలా మందికి తెలుసు. ఆయన దాగున్న ప్రాంతాలపై దాడి చేసినప్పుడు పాక్ సైన్యంలోని ఆయన సన్నిహితులు ముందుగానే సమాచారాన్ని లీక్చేసేవారు'' అని ఒక పత్రంలో ఉంది. లాడెన్ అనుచరుడు లిబియాకు చెందిన అబుల్ అల్ లిబిని గ్వాంటనామో బే కారాగారంలో విచారించినప్పుడు అతడు పాకిస్థాన్లోని అబోటాబాద్లో ఉన్నట్లు అమెరికాకు తొలి ఆనవాళ్లు దొరికాయి. వికీలీక్స్ విడుదల చేసిన 2008 నాటి అమెరికా రహస్య దౌత్య పత్రాల్లో ఇది ఉంది. ''2003 జులైలో లాడెన్ నుంచి మౌల్వి అబ్దుల్ ఖలీక్ ద్వారా అల్ లిబికి లేఖ అందింది. విరాళాలు స్వీకరించడం, ప్రయాణాలకు ఏర్పాట్లు చేయడం, పాకిస్థాన్లోని కుటుంబాలకు నిధులివ్వడం వంటివి చేపట్టాలని ఇందులో ఉంది. లిబి ఇక లాడెన్కు పాకిస్థాన్లోని ఇతరులకు మధ్య మెసెంజర్గా ఉంటాడని ఈ లేఖలో ఉంది. 2003 మధ్యలో లిబి తన కుటుంబాన్ని అబోటాబాద్కు మార్చాడు. అబోటాబాద్కు పెషావర్కు మధ్య పనిచేశాడు'' అని వికీలీక్స్ పత్రంలో ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం బహిర్గతమవ్వడం వల్ల గ్వాంటనామో బే బందీలు ఇచ్చిన సమాచారాన్ని అమెరికా పాకిస్థాన్తో పంచుకోలేదు.
లాడెన్ ఎక్కడున్నాడో కనుక్కొనేందుకు తాము ప్రయత్నిస్తున్నామని పాక్నాయకులు అమెరికాకు చెబుతున్నారు. అమెరికా ఈ వ్యాఖ్యలను విశ్వసించడంలేదు. లష్కరే తొయిబా సహా అనేక ఉగ్రవాద సంస్థలకు లోపాయకారీ సహాయం అందించకుండా ఐఎస్ఐకు దిశానిర్దేశం చేయాలని ఆ దేశం స్పష్టంచేస్తోంది. 2009లో పాక్ సైన్యాధిపతి జనరల్ కయానీ పర్యటనకు ముందు నాటి అమెరికా రాయబారి అన్నెప్యాటర్సన్ వాషింగ్టన్కు లేఖ రాశారు. దీన్ని వికీలీక్స్ సంపాదించింది.