పదవులకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామా
రాజీనామాలకు ముందు కెటిఆర్, హరీష్ రావులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అంతా ఒకేత్రాటిపై ఉన్నదని కేంద్రానికి సంకేతాలు ఇవ్వడానికే తాము రాజీనామాలకు సిద్ధపడుతున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పార్టీగా కాంగ్రెసు, టిడిపి రాజీనామాలు చేసినప్పుడు తాము కూడా రాజీనామా చేయవల్సిన అవసరం ఉందన్నారు. తమపై రాజీనామాలకు ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. కూకట్పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ రాజీనామా విషయం ప్రజలు చూసుకుంటారని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను ఢిల్లీకి తెలియజేయాలని డిమాండ్ చేశారు. జెఏసి నాయకులతో చర్చించిన తర్వాతే తాము రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 10వ రకు జెఏసి కార్యక్రమాలు చేపట్టిందని అందులో పాల్గొంటామని చెప్పారు. ఆ లోగా కేంద్రం స్పందిస్తే సరి లేదంటే ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. రాష్ట్రపతి పాలనతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణే తమ ముందున్న ధ్యేయమన్నారు. తెలంగాణ రావడానికి ఇదే అద్బుతమైన అవకాశం అన్నారు. కాగా టిఆర్ఎస్లోని 8మంది రాజీనామాతో రాజీనామాలు 90కి చేరుకున్నాయి. తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు కూడా తన రాజీనామా లేఖను మండలి చైర్మన్కు పంపించారు. దీంతో ఎమ్మెల్సీల రాజీనామాల సంఖ్య 17కు చేరుకుంది.