తెలంగాణ సకల జనుల సమ్మె, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సింగరేణిలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్, లాంగ్ వాల్ ప్రాజెక్టులలో ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. కేవలం భూపాల్ పల్లిలోనే 7వేల మంది, ఇల్లందులో మూడు వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. పలు జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు తాము కూడా సమ్మెలో పాల్గొంటామని ప్రైవేటు పాఠశాలల సంఘం వరంగల్లో ప్రకటించింది.
తెలంగాణ న్యాయవాదులు విధులకు హాజరు కారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదులు విధులకు హాజరు కాకుంటే కోర్టు దిక్కరణ కింద చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కాగా తెలంగాణలో సకల జనుల సమ్మెకు మద్దతుగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ తెలంగాణ శాసనసభ్యులు కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.