లోక్పాల్పై సోనియాను ప్రశ్నించిన అన్నా హజారే
తాము పార్లమెంటును విశ్వసిస్తాం అని చెబుతూ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్పాల్లో రిజర్వేషన్ వ్యవహారం గురువారం ఉదయం లోక్సభలో గందరగోళం సృష్టించిన విషయాన్ని అన్నా దృష్టికి తీసుకువెళ్లగా అదంతా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అని ఆయన అన్నారు. లోక్ సభ ముందుకు లోక్పాల్ బిల్లు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు లోక్సభ తిరిగి సమావేశమైన అనంతరం మంత్రి నారాయణ స్వామి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ముందు ఆయన గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించడానికి అనుమతి కోరారు. స్పీకర్ అనుమతించిన అనంతరం పాత బిల్లును ఉపసంహరించారు. ఆ తర్వాత కొత్త బిల్లును ప్రవేశపెట్టారు.
బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ లేచి ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం అని వ్యాఖ్యానించడంతో సభలో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ముందు ఈ బిల్లును ఉపసంహరించి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం నిలిచే కొత్త బిల్లును తీసుకురావాలని డిమాండు చేశారు. అందుకు సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అందరూ బాగా ఆలోచించి రూపొందించిన బిల్లు అని సమర్థించుకున్నారు. ఒకవేళ ఈ బిల్లులో రిజర్వేషన్లకు స్థానం కల్పించడమే రాజ్యాంగ విరుద్ధమైతే ఆ విషయాన్ని సుప్రీం కోర్టు తేలుస్తుందని, గతంలో కూడా ఇలా జరిగాయని ఆయన వివరించారు. గందరగోళం చెలరేగడంతో సభ అంతకు ముందు రెండు సార్లు వాయిదా పడింది.