కృష్ణతో జగన్కు నో రిలేషన్, బాబుపై అనుమానం: గట్టు
జగన్ వెంట జనం ఉన్నారని ఆయన చెప్పారు. జగన్ని చూసి భయపడటం అంటే జనాన్ని చూసి భయపడటమేనని ఆయన అభివర్ణించారు. ప్రజల్లోకి వెళ్లి జగన్ని విమర్శిస్తే కొడతారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఏ తప్పు జరిగినా జగన్కు ఆపాదించడం అలవాటుగా మారిందని విమర్శించారు.
నాడు టిడిపి నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్రని చంపినప్పుడు జగన్ది బాధ్యత అని విమర్శించారని, ఇప్పుడు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితులు జగన్కు సన్నిహితులు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఇరవై రెండు వేల కిలోమీటర్లు ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయాలని ఎలా అనిపిస్తోందన్నారు.
జగన్ పైన టిడిపి, కాంగ్రెసు నేతలు దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుచరులు ఎందరిపై కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. ఎందరు జైలుకు వెళ్లారన్నారు. ఈ విషయాలు ఏవీ ఎల్లో పత్రికలకు కనిపించవా అన్నారు. టిడిపి ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలనే అక్కడ ఢిల్లీలో కాంగ్రెసు చెబుతోందన్నారు.
తమకు వ్యక్తిగత దూషణలకు దిగే అలవాటు లేదన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నెరపడమే వైయస్సార్ కాంగ్రెసుకు తెలుసన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ప్రజలు కడప, పులివెందులలో బుద్ధి చెప్పారని, ఆ తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరులోనూ షాక్ ఇచ్చారన్నారు.
మంగళి కృష్ణతో జగన్కు సంబంధం అంటగడితే.. స్టాంపుల కుంభకోణానికి బాబు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఆయన భార్య భానుమతి టిడిపి అధినేత పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బాబుపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్ కూడా దక్కదన్నారు.