మీరు నీతివంతులైతే సరిపోదు: రామ్దేవ్, అన్నాతో దీక్ష
నల్లధనంపై ఆర్థిక మంత్రి చిదంబరం సమాధానం చెప్పాలని నిలదీశారు. అవినీతిమంత్రులపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తప్పించాలన్నారు. విదేశాలలో ఉన్న భారతీయుల నల్లడబ్బును వెనక్కి రప్పించాలని, అప్పుడే దేశం ఎంతో ఆర్థిక అభివృద్ధి చెందుతుందన్నారు.
కాగా అంతకుముందు అన్నా హజారే, రామ్ దేవ్ బాబా రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి దీక్ష స్థలికి చేరుకున్నారు. వీరి ఒక్క రోజు దీక్షకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చి మద్దతు ప్రకటించారు. ఈ దీక్ష ఉదయం ప్రారంభమైంది. అవినీతిపై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ, ప్రచారంపై చర్చించనున్నట్లు ఈ సందర్భంగా హజారే ప్రకటించారు. అవినీతిపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
కాగా అన్నా హజారే, రామ్ దేవ్ బాబాల దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారత్ స్వాభిమాన్ ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు హైదరాబాదు ఇందిరాపార్కు వద్ద నిరసనకు దిగారు. దేశభక్తి గీతాలను ఆలపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాకవి గద్దర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద పెత్తనం వల్లే భారతదేశంలో నల్లడబ్బు పెరుగుతోందని, ఇక్కడి అవినీతిపరులకు ఆ శక్తుల మద్దతుందని విమర్శించారు.