వందకోట్ల ఖర్చుకు సై!: గాలి బెయిల్ డీల్పై 2వఛార్జీషీట్
తాజా చార్జిషీట్లో గాలికి బెయిల్ కోసం జడ్జీలు లక్ష్మీ నరసింహారావు, ప్రభాకర్ రావు చేసిన ప్రయత్నాలు, ఇందులో గాలి బంధువు దశరథరామి రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రావి సూర్యప్రకాశ్ పాత్రను వెల్లడించింది. హైకోర్టు రిజిస్ట్రార్ లక్ష్మీనరసింహ రావును ఏప్రిల్ 13న గాలి బంధువు దశరథరామి రెడ్డి బెయిల్ కోసం సంప్రదించారని, ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో రిజిస్ట్రార్ వంద కోట్లు అడిగారని ఛార్జీషీట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అందుకు దశరథరామి రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేయడంతో అప్పటి సిబిఐ కోర్టు జడ్జి నాగమారుతి శర్మను ఇంటికి పిలిచి లక్ష్మీనరసింహ రావు 40కోట్లు ఆఫర్ చేశారని, అయితే ఆయన తిరస్కరించడంతో ప్రయత్నం బెడిసి కొట్టిందని, దీంతో కొత్త సిబిఐ కోర్టులు ప్రారంభమయ్యాక ప్రభాకర్ రావు ద్వారా మరో ప్రయత్నం చేశారని పేర్కొందని సమాచారం. మే 3న ఢిల్లీ నుంచి గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, దశరథరామిరెడ్డి వస్తుండగా విమానాశ్రయంలో సూర్యప్రకాశ్ బాబు, కొల్లి లక్ష్మయ్య చౌదరి కలిశారని పేర్కొంది.
ప్రభాకర్ రావుతో పని పూర్తిచేయిస్తానని లక్ష్మీనరసింహ రావు చెప్పినట్లు దశరథరామి రెడ్డికి సూర్యప్రకాశ్ చెప్పారని, అందుకు పదికోట్లు ఇవ్వాలని కోరారని, అయితే రూ. 15కోట్లయినా ఇస్తామని, అయితే ముందుగా జడ్జి పట్టాభి రామారావుతో తమకు ఓ సమావేశం ఏర్పాటు చేయాలని దశరథరామి రెడ్డి షరతు పెట్టారని, పట్టాభి కలవకపోవడంతో ఆ ప్రయత్నమూ విఫలమైందని, చివరికి రౌడీషీటర్ యాదగిరి ప్రయత్నంతో మే రెండో వారంలో గాలికి బెయిలొచ్చిందని రెండో చార్జిషీట్లో ఎసిబి వివరించిందని సమాచారం.
రవిచంద్రకు బెయిల్ పట్టాభికి నో
బెయిల్ స్కాంలో ప్రధాన నిందితుడు జడ్జి పట్టాభి రామారావుకు ఎసిబి కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో ఆయన కుమారుడు రవిచంద్రకు మాత్రం గురువారం బెయిల్ లభించింది. గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే సురేష్ బాబు, రౌడీషీటర్ యాదగిరి బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించారు. రవిచంద్రతో పాటు జూనియర్ న్యాయవాది ఆదిత్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జడ్జిలు ప్రభాకర్రావు, లక్ష్మీనరసింహ సహా ఇతర నిందితుల రిమాండ్ను ఈ నెల 20 వరకు కోర్టు పొడిగించింది.