తాగి పోలీసులకు చిక్కిన మంత్రి విశ్వరూప్ తనయుడు
పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడినవారిలో విశ్వరూప్ కుమారుడు కూడా ఉన్నారు. పోలీసులు అతను నడుపుతున్న బిఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, అతన్ని వేరే కారులో ఇంటికి పంపించేశారు. మంగళవారంనాడు కోర్టుకు హాజరు కావాలని పోలీసులు అతన్ని ఆదేశించారు. అతనికి 2500 రూపాయల జరిమానా కూడా వేశారు.
కృష్ణారెడ్డి నడిపిన ఎపి9 సీసీ 117 నెంబర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి ధ్రువీకరించారు. మంగళవారంనాడు కృష్ణా రెడ్డి కోర్టుకు హాజరవుతారని, ఆ సమయంలో కృష్ణారెడ్డికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. వివరాలు సేకరించి కృష్ణారెడ్డిని ఇంటికి పంపించినట్లు ఆయన తెలిపారు.
కాగా, తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష లేదని పోలీసు ఉన్నతాధికారి సివి ఆనంద్ చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. మంత్రి కుమారుడికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తాగి డ్రైవింగ్ చేయకూడదనే చైతన్యం నగర ప్రజల్లో పెరుగుతోందని, ఇది సంతోషకరమైన పరిణామమని ఆయన అన్నారు.