రాఘవ విడుదలలో జాప్యం: జగన్ కూల్.. ధర్మాన డల్
మరోవైపు విజయ రాఘవ బెయిల్ను 4 రోజులు నిలిపివేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) చేసిన అభ్యర్థనను నాంపల్లి సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. విజయ రాఘవకు నాంపల్లి ప్రత్యేక కోర్టు సోమవారం రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ను మంజూరు చేసింది. సిబిఐ విజయ రాఘవను జనవరి 28న ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసింది. ఎమ్మార్ విల్లాల డాక్యుమెంట్లు తారుమారు చేశాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.
కాగా మంగళవారం కోర్టు మెట్లెక్కిన మంత్రి ధర్మాన ప్రసాద రావు డల్గా ఉండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం కూల్ గా ఉన్నారు. కేబినెట్ మాజీ సహచరుడు మోపిదేవి పక్కనే నిలబడ్డా ధర్మాన అన్యమనస్కంగానే పలకరించారు. జగన్ తానే చొరవ చేసి కరచాలనం చేసినా పెద్ద స్పందన చూపలేదు. అదే సమయంలో మోపిదేవి, జగన్ మాత్రం ఆసాంతం హుషారుగా కనిపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రెహ్మాన్ కోర్టు ప్రాంగణంలో సిబిఐ పైన విరుచుకు పడ్డారు. బెడ్ షీట్ల మాదిరిగా సిబిఐ ఛార్జీషీట్ల మీద ఛార్జీషీట్లు వేస్తూ పోతోందని మండిపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి అనుచరులు కూడా కాసేపు హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.