మంత్రి వర్గ విస్తరణ: బాల్ థాకరే నోట జగన్, చిరంజీవి!
ఆంధ్రప్రదేశ్కు పెద్ద పీట వేయడంపై అన్ని పత్రికలు జగన్, తెలంగాణ అంశాలే కారణమని రాశాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి మండలిలో ఏపికి ప్రాధాన్యత ఇచ్చారని పలు పత్రికలు పేర్కొన్నాయి. తన పత్రిక సామ్నాలో బాల్ థాకరే.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందు వల్లనే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.
అయితే ఈ అంశాలు జగన్ పైన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపుకు చెందిన లోక్ సత్తా దినపత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడైన జగన్ కొద్దీ కాలం తర్వాత కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారని తెలిపింది.
ఆయనపై ప్రస్తుతం దర్యాఫ్తులు జరుగుతున్నాయని, ఆస్తుల కేసులో జైలులో ఉన్నారని తెలిపింది. తెలంగాణ అంశం కూడా కాంగ్రెసు ఎటూ తేల్చలేక పోయిందని పేర్కొంది. జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎపికి పెద్ద పీట వేసిందని లోక్ సత్తా పత్రిక పేర్కొంది.