వైయస్ వల్లే ఈ షాక్లు, గాలి ఒక్కటే మిగిలింది: బాబు
"వైయస్, కాంగ్రెస్ దొంగలు కమీషన్లకు ఆశపడి ప్రైవేటు విద్యుత్ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొన్నారు. ఇప్పుడా భారాన్నంతా సర్చార్జీల రూపంలో పేదలపై వేస్తున్నార''ని విమర్శించారు. సీఎం యువ కిరణం కాదు..ఆరిపోయిన అవినీతి కిరణం అని, ఆయన పాలన ప్రజల పాలిట శాపమని తూర్పారబట్టారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత వైఎస్దేనని దుయ్యబట్టారు.
"వైయస్ ఓ మేకవన్నె పులి. ఎమ్మెల్యేలను పాడుచేశారు. అధికారులను జైలుకు పంపారు. బతికుండగా వైయస్ ప్రతిసారీ విశ్వసనీయత గురించి మాట్లాడేవారు. విశ్వసనీయత అంటే దోచుకోవడమా?' అన్నారు. ఆయన హయాంలో టిడిపి కార్యకర్తలు 200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరకు వైయస్ పత్రికల్నీ వదిలి పెట్టలేదని, కొడుకు పత్రిక, టీవీ కోసం ఇతర పత్రికల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. తాత రాజారెడ్డి హత్యా రాజకీయ వారసత్వాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారని ధ్వజమెత్తారు."
జగన్ తండ్రి వైయస్సే తననేమీ చేయలేకపోయాడని, ఇక ఆయనేం చేస్తాడన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం టిడిపిదేనని ధీమా వ్యక్తం చేశారు. "కొంతమందికి కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. 1984 ఆగస్టు సంక్షోభం గురించి నా మనసు ఎందుకో శంకించింది. నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారని ముందే అనిపించింది. సంకల్పాన్ని బట్టి బుద్ధి పనిచేస్తుంది'' అని చెప్పుకొచ్చారు.
గతంలో పెళ్లి చేయాలంటే రెండు తరాలు చూసేవారని, అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు తరాలు చూడాలేమోనని చమత్కరించారు. ఈ సమయంలో జిలానీ అనే కార్యకర్త వైయస్ సమాధి అంశం లేవనెత్తడంతో చర్చ ఆసక్తిదాయకంగా మారింది. సార్! ఇడుపులపాయలో వైయస్ సమాధి చాలా పెద్దదిగా కట్టారని, చుట్టూ కరెంటు పెట్టారని,ఇందిరా, రాజీవ్ సమాధులు కూడా ఇంత పెద్దగా లేవన్నారు. అసలు ఆ సమాధిలో వైయస్ శవం ఉందో.. మరేముందో?' అని అనుమానం వ్యక్తం చేశారు. దానికి చంద్రబాబు... బంగారం దాచిపెట్టారేమో? అని సరదాగా అన్నారు.