బంగారు తల్లి: కిరణ్ రెడ్డికి మంత్రుల సెగ (పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వాటి పేరుతో జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించకుండానే వివిధ పథకాలను ప్రవేశపెట్టి ప్రకటిస్తున్నారనే విమర్శలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే, వాటిని ముఖ్యమంత్రి పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. తన దారిలో తాను నడుస్తున్నారు.
తాజాగా, ముఖ్యమంత్రి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో బంగారు తల్లి పథకానికి శ్రీకారం చుట్టారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, అంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారి కుటుంబంలో ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి పేరు మీద ప్రభుత్వం ఉచిత విద్యను అందించడానికి వీలుగా కొంత సొమ్మును బ్యాంకులో జమ చేస్తుంది. దానికి ముఖ్యమంత్రి బంగారుతల్లి అనే పేరు పెట్టారు. ఇది పాత పథకమే అనే విమర్శలు ఉన్నాయి. పాత పథకానికే కొత్త పేరు పెట్టారనే వారు కూడా ఉన్నారు.
అయితే, బంగారు తల్లి పథకం కాంగ్రెసు సీనియర్ మంత్రులకు మంట పుట్టిస్తోంది. తమను సంప్రదించుకుండానే కిరణ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆ పథకాన్ని ప్రకటించారని అంటున్నారు. తమ అసంతృప్తిని సీనియర్ మంత్రులు జానా రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ బహిరంగంగానే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.
సీనియర్ మంత్రి జానా రెడ్డి బంగారుతల్లి పథకంపై తనదైన శైలిలో ప్రతిస్పందించారు. పథకాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, మంత్రివర్గంలో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలపై అడుగుతామని ఆయన అన్నారు. జానారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిపై ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. మొదటి నుంచీ జానారెడ్డికి ముఖ్యమంత్రి దూరం పాటిస్తున్నారు.
మరో సీనియర్ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చాలా కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా, బంగారు తల్లి పథకంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ పథకాన్ని అమలు చేయకపోతే తరిమి కొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
బంగారుతల్లి పథకంపై పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కాస్తా లౌక్యంగా ప్రతిస్పందించారు. పథకం గురించి తెలుసకుని మాట్లాడుతానని ఆయన అన్నారు. అంటే, మంత్రులతో చర్చించలేదని ఆయన చెప్పకనే చెప్పారని అనుకోవాలి. చాలా కాలంగా ముఖ్యమంత్రితో ఆయన విభేదిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ముఖం మీదే చెప్పేశారు. ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనకు అదే జిల్లాకు చెందినప్పటికీ దామోదర రాజనర్సింహ దూరంగా ఉన్నారు.
మంత్రివర్గంలో తనదైన జట్టును కూడగట్టుకున్న ముఖ్యమంత్రి ఇలా జిల్లా పర్యటనలో ఆ జట్టుతో కలిసి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి పర్యటనలో బంగారు తల్లి పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
బంగారుతల్లి పథకం మంచిదని, మంచి పథకాల గురించి అందరితో చర్చించాల్సిన అవసరం లేదని మంత్రి దానం నాగేందర్ అన్నారు. దానం నాగేందర్ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం ఉంది. బంగారుతల్లి పథకం గురించి మంత్రివర్గంలో చర్చించారని పితాని సత్యనారాయణ అంటున్నారు.