కనిమొళి ఎఫెక్ట్: మోడీకి విజయకాంత్ జై కొట్టనున్నారా?
రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ డిఎంకె పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తనయ కనిమొళికి మద్దతు ప్రకటించింది. డిఎంకె నిన్నటి వరకు యూపిఏ 2 ప్రభుత్వంలో ఉంది. శ్రీలంకలోని తమిళ సమస్యల విషయమై కొద్ది నెలల క్రితం కాంగ్రెసుకు డిఎంకె దూరమైంది.
అయితే 2014 ఎన్నికల నాటికి తిరిగి ఒక్కటి కావాలని ఇటు డిఎంకె, అటు కాంగ్రెసు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో డిఎంకె అభ్యర్థికి కాంగ్రెసు మద్దతు పలికింది. ఇదిలా ఉంటే కాంగ్రెసు పార్టీ తమ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారని విజయకాంత్ భావించారు. కానీ ఆయన విశ్వాసంపై కాంగ్రెసు నీళ్లు చల్లింది.
దీంతో ఇప్పుడు ఆయన 2014లో కొత్త పొత్తు కోసం వెతుక్కుంటున్నారు. బిజెపికి మద్దతిస్తారని అంటున్నారు. 2009 ఎన్నికలలో విజయకాంత్ అన్నాడిఎంకెతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత జయలలితతో విభేదాలు వచ్చి ఆయన ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకున్నారు. ఈ అంశం డిఎండికె, అన్నాడిఎంకెల మధ్య రాష్ట్రంలో రాజకీయ వేడిని కూడా రగిలించింది.
అన్నాడిఎంకె, కాంగ్రెసుల పట్ల అసంతృప్తితో ఉన్న విజయకాంత్ వచ్చే ఎన్నికలలో నరేంద్రమోడీ సారథ్యంలోని బిజెపికి మద్దతు పలికే అవకాశాలున్నాయి. తమిళనాడు పరిధిలో ఇప్పటికే బిజెపితో జయలలిత మద్దతుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రత్యర్థి విజయకాంత్ కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే తమిళనాడులో రెండ వ్యతిరేక పార్టీలు ఒక జాతీయ పార్టీకి మద్దతివ్వడం సాధారణమే అంటున్నారు.