7న మళ్లీ సైకిల్ ఎక్కనున్న మాజీ ఎంపి చాడ
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది. మాజీలను పార్టీలో చేర్చుకోవడానికి ఈ ప్రాంతీయ సదస్సులను వేదికలుగా మార్చుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన వరంగల్లో జరిగే ప్రాంతీయ సదస్సులో చాడ సురేష్ రెడ్డితో పాటు ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి.
చాడా సురేష్ రెడ్డి, మండల శ్రీరాములు ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు సమక్షంలో వారు తిరిగి పార్టీలో చేరే అవకాశం ఉంది. గతంలో ఈ ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ వెలుగు వెలిగారు.
సురేష్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో ఆయన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. చాడ సురేష్ రెడ్డిని చేర్చుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు సాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆయన తిరిగి సొంతగూటికి చేరేందుకే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. గతంలో రెండు సార్లు హన్మకొండ నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.