కెసిఆర్ ఫిట్మెంట్, బాబుపై ఒత్తిడి: ఆగమాగమని నమస్తే తెలంగాణ
హైదరాబాద్: ప్రభుత్వ్యోద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు భారీగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడికి గురవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే విషయంలో తనపైన తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆయన స్వయంగా అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్రం 43 శాతం ఫిట్మెంట్ను ప్రకటించిన తర్వాత ఉద్యోగులనుంచి తనపైన ఒత్తిడి ఇంకా ఎక్కువైందని తెలంగాణ రాష్ట్రంలో ఫిట్మెంట్ విషయాన్ని పరోక్షంగా ఉద్దేశించి చెప్పారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని, పీఆర్సీ ప్రకటించే పరిస్థితిలో లేదని అన్నారు. అదే సమయంలో ఉద్యోగుల కోరికను కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించారు. నిధుల కొరత తమ రాష్ర్టానికి ప్రధానమైన సమస్య అని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ను కొన్ని ప్రత్యేక కోణాల నుంచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, సబ్ కమిటీ పిఆర్సీకి సబంధించిన త్వరలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తెలంగాణలో మాదిరిగా తమకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఆగమాగమంటూ నమస్తే తెలంగాణ పత్రిక
ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక మరోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరిస్థితి ఆగమాగమంటూ వ్యాఖ్యానించింది. తెలంగాణను ఉద్ధరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకువస్తామని తెలంగాణ టీడీపీ నాయకులు ప్రకటన మీద ప్రకటనలు చేస్తున్నారంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది. చంద్రబాబును ఏదో గొప్ప పాలనాదక్షుడుగా, కంటిచూపుతో పార్టీని నడిపే నాయకుడిగా చిత్రించేందుకు తంటాలు పడుతున్నారని, తెలంగాణవాదులు ఈ ప్రయత్నాలు చూసి నవ్వుకుంటున్నారని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
నమస్తే తెలంగాణ వార్తాకథనం ఇలా సాగింది - తెలంగాణను ఉద్ధరించడం సంగతి అలా ఉంచితే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడమని అంటున్నారు. ఇంతకీ ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నది? ఒక్కమాటలో చెప్పాలంటే అంతా అరాచకం. అధికారపక్షం నాయకుల సిగపట్లతో వీధికెక్కింది. మంత్రులకు-మంత్రులకు, మంత్రులకు-సొంత పార్టీ ఎంపీలకు మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఒకరు అధికారులను బదిలీ చేస్తారు. ఇంకొకరు దాన్ని రద్దు చేసే ఆర్డరు తీసుకువస్తారు.
ఇంకా ఆ కథనం ఇలా సాగింది - ఇక రాజధాని అంశంలోనూ అదేతీరు. పార్టీయే రెండుగా చీలి ఉంది. ఎవరికి వారే రాజులు.. మంత్రులు. ఇదీ ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇక మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ మిత్రపక్షమో వైరి పక్షమో అటు వారికీ ఇటు వీరికి అర్థం కావడం లేదు. బీజేపీ మంత్రులకు కేంద్ర నాయకులు సూపర్ సీఎంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబుది మింగలేని కక్కలేని పరిస్థితి. కానీ ఇవేమీ తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కనిపించడం లేదు. సంక్షేమ పథకాలతో ముందకువెళుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఉద్ధరించేందుకు చంద్రబాబు పర్యటిస్తారని, కరెంటు కావాలని అడుక్కుంటూ చంద్రబాబుకు లేఖ రాయాలని సుద్దులు చెప్తున్నారు.
విశాఖపట్నం జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయన్నపాత్రుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందంటూ నమస్తే తెలంగాణ వీధిపోరాటాలంటూ వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది - కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు విజయవాడ ఎంపీ కేశినేని నానికి అస్సలు పొసగడం లేదు. ఏపీ రాజధానికి భూ సేకరణ జరుగుతున్న తీరు రైతులకు ఇబ్బందిగా మారిందని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటుచేయాలని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కర్నూలు వేదికగా హాజరైన ఓ సభలో ఆదివారం ప్రసంగిస్తూ రెండో రాజధాని ఊసే లేదన్నారు. తెలంగాణతో పోలికే లేదంటూ తెలుగుదేశం తెలంగాణ నాయకుల తీరుపై ఆ పత్రిక దుమ్మెత్తి పోసింది.