కాకి మాధవరావు మనవడి కిడ్నాప్: ఓబులేష్పై కేసు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ కెబిఆర్ పార్కు కాల్పుల నిందితుడు ఓబులేశుపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో సుమోటో కేసు నమోదైంది. 2014 ఫిబ్రవరి 12వ తేదీన రిటైర్డ్ ఐఏఎన్ కాకి మాధవరావు మనవడిని కిడ్నాప్ చేసిన ఓబులేశు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై 364ఏ, 392, 25, 27 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓబులేష్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, ఓబులేష్ అద్దెకు ఉన్న గది నుంచి పోలీసులు రెండు డమ్మీ బుల్లెట్లను, 22 లైవ్ బుల్లెట్లను, ఆరు వాడని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డి కిడ్నాప్ యత్నం కేసులో గతంలో గ్రేహౌండ్స్లో పనిచేసిన ఓబులేష్ను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఓబులేష్ గతంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, మహబూబ్నగర్ జిల్లాకు తీసుకుని వెళ్లి అక్కడ పది లక్షల రూపాయలు తీసుకుని వదిలేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఓబులేష్ను మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కిడ్నాప్నకు గురైన వ్యక్తి ఎవరనే విషయాన్ని కమిషనర్ వెల్లడించలేదు. ఆ సంఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని కూడా ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు వరకు కారులో తీసుకుని వెళ్లి పది లక్షలు తీసుకుని కారును, కారు యజమానిని వదిలేశాడని మహేందర్ రెడ్డి శుక్రవారంనాడు చెప్పారు. మరిన్ని విషయాలు ఏమైనా ఉంటే విచారణలో తేలుతాయని ఆయన చెప్పారు. ఆ సొమ్ము ఓబులేష్ ఖాతాలో జమ అయినట్లు కూడా తెలుస్తోందని ఆయన చెప్పారు. కొంత సొమ్ముతో వాహనం కొనుక్కున్నానని చెప్పాడని ఆయన అన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెబిఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేష్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఎకె 47 రైఫిల్ను, బుల్లెట్లను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. నిత్యానంద రెడ్డిపై ఓబులేష్ ఎందుకు దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు, ఎలా పారిపోయాడనే విషయాలను కూడా ఆయన వివరించారు. కర్నూలు జిల్లాలో అతన్ని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.