మాటల యుద్ధం: ఖబడ్దార్ :కాల్వ, టీవీల్లో చూస్తున్నారు: జగన్
హైదరాబాద్: రైతుల రుణమాఫీపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శానససభలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు రౌడీల్లో ప్రవర్తిస్తున్నారని టిడిపి ఎమ్మేల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. బయట రౌడీల్లా ప్రవర్తించినా సభలో ఆ విధంగా ప్రవర్తిస్తే కుదరదని అంటూ వారిని ఖబడ్డార్ అని హెచ్చరించారు.
కాగా, రుణమాఫీపై మాట్లాడే అర్హత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులు, ప్రజలు తమను అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతనలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం రుణమాఫీకి కేటాయించిన నిధులు వడ్డీకి సరిపోవని ఆయన అన్నారు. రుణమాఫీ అన్నది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టం చేయలేదని ఆయన అన్నారు. రైతు రుణాల మాఫీ చేస్తామని చంద్రబాబు తొలి సంతకం చేశారని, అసలెంత.. వడ్డీ ఎంత మాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు.
అసెంబ్లీలో ఏం జరుగుతోందో ప్రజలు టీవీల్లో చూస్తున్నారని ఆయన అన్నారు. వ్యవస్థలన్నీ కుప్పకూలే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారా, వారిని రుణగ్రస్థులను చేస్తున్నారా అని జగన్ అడిగారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అవగాహనతోనే రైతుల రుణమాఫీకి హామీ ఇచ్చామని టిడిపి చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కుటుంబానికి ఒక్క రుణం మాత్రమే మాఫీ చేస్తామని అప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ జరగలేదు, కొత్త రుణాలు రావడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు వడ్డీలేని రుణాల పథకాన్ని తీసేస్తున్నారా అని ఆయన అడిగారు. వడ్డీకి కూడా సరిపోని రుణమాఫీతో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీపై మాట తప్పారని జగన్ విమర్శించారు. శాసనసభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని అప్పట్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై నిబంధనల పేరిట కోత పెట్టారని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణమాఫీ పరిమితి పేరిట రైతులను మోసం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.