సీపీఐ రామకృష్ణ ఛాలెంజ్ యాక్సెప్టెడ్: ప్లేస్ ఎక్కడో మీరే డిసైడ్ చేయండి: బీజేపీ విష్ణు
అనంతపురం: రాయలసీమ అభివృద్ధిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాయలసీమపై ఎక్కడ చర్చ పెట్టాలో.. స్థలాన్ని కూడా ఆయనే డిసైడ్ చేసుకోవచ్చని చెప్పారు. కర్నూలు కొండారెడ్డి బురుజు గానీ, కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద గానీ.. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే చర్చకు తాము సిద్ధమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైఎస్ కుటుంబంతో పోలవరం బంధం: అది దేవుడు రాసిన స్క్రిప్ట్: ఎవరూ మార్చలేరు
రాయలసీమ ప్రాంతం అభివృద్ధిపై ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ రామకృష్ణ విసిరిన సవాల్పై ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. రామకృష్ణ సవాల్ను తాను స్వీకరిస్తున్నామని అన్నారు. రాయలసీమ వెనుకబాటుకు బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ ఆయన రాసిన లేఖను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
రాయలసీమకు నిజంగా ద్రోహం చేసింది కమ్యూనిస్టులేనని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమలోని పరిశ్రమలను వామపక్ష నేతలు మూసివేయించారని ఆరోపించారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న అనేక సమస్యలకు ప్రధాన కారకులు కమ్యూనిస్టులేనని ఎదురుదాడికి దిగారు. ఈ బహిరంగ చర్చల ద్వారా కమ్యూనిస్టులకు సరైన సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ చర్చల్లో పాల్గొనడానికి రావాల్సిందిగా ఆహ్వనిస్తున్నామని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధి, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు, ఈ ప్రాంతంలో జాతీయ రహదారుల నిర్మాణం, కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేస్తోన్న నిధులు, జాతీయ ఉపాధి హామీ పథకం పనులు గానీ.. ఇలా ఏ అంశంలోనైనా కమ్యూనిస్టు నాయకులతో చర్చించడానికి తాము తయారుగా ఉన్నామని అన్నారు. కమ్యూనిస్టు నాయకులను ఆయన కళ్లు ఉండీ చూడలేని కబోధులుగా అభివర్ణించారు.
రాష్ట్రాభివృద్ధి కూడా ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ-జనసేన డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే గానీ రాష్ట్రం అభివృద్ధి చెందబోదని చెప్పారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అసలు ఉనికిలో లేని పార్టీలని ఎద్దేవా చేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీ రెడ్డి గానీ, రామకృష్ణ గానీ, సీపీఎం నేతలు గానీ టీవీల్లో కనిపించాలనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని చురకలు అంటించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్.. రాష్ట్రానికి పట్టిన శనిగా విమర్శించారు.