పులివెందులలో జగన్.. వైఎస్సార్కు నివాళులు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో సీఎం బిజిబిజీ
కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

వైఎస్సార్కి ఘన నివాళులు
తొలుత ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటుకు సీఎం జగన్ చేరుకొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. వైస్సార్ ఘాట్ ను జగన్ తల్లి విజయమ్మ కూడా సందర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. తర్వాత అక్కడ నిర్వహించిన ప్రార్థనలలో పాల్గొన్నారు.

ఆదిత్య బిర్లా యూనిట్కు శంకుస్థాపన
మధ్యాహ్నం పులివెందుల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీ చేరుకుంటారు . ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగసభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. తర్వాత పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం నూతన మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కుకు చేరుకుంటారు. ఆంధ్ర ఆక్వా హబ్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ లో సీఎం జగన్ రాత్రికి బసచేస్తారు .

క్రిస్మస్ వేడుకలు..
రేపు ( శనివారం ) క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ప్రతి ఏటా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. చర్చ్ ఆవరణలో నిర్మించిన షాపింగ్ క్లాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. తర్వాత.. కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరతారు.
Recommended Video
పేదలకు అండగా..
కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ( గురువారం ) ప్రొద్దుటూరు, బద్వేలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని .. వారికి రుణపడి ఉంటానన్నారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ని జగన్ ప్రారంభించారు. సుమారు 516 కోట్లతో.. మొత్తం 8 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు . బద్వేలు నియోజకవర్గంలో సెంచరీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications