చంద్రబాబుకు బాక్సైట్ చిక్కులు: 'పవన్ కళ్యాణ్ను నమ్మేది ఎలా'
విశాఖ: బాక్సైట్ జీవోను పరిశీలించడం కాదని, రద్దు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిపిఐ జాతీయ నేత నారాయణ మంగళవారం సూచించారు. సదరు జీవో రద్దు చేసేంత వరకు తమ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో మాట్లాడారు.
ప్రత్యేక హోదా పైన జాతీయ పార్టీలతో కలిసి డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. బీహార్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి మంచి గుణపాఠం అని చెప్పారు. ఇక పైన అన్ని రాష్ట్రాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూటములు ఏర్పడుతాయని చెప్పారు.
పదేపదే స్వదేశీ అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పెట్టుబడులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడులు ఉత్పత్తి రంగంలో అనుమతిస్తే అభ్యంతరం ఏమీ లేదన్నారు. కానీ సేవా రంగంలో విదేశీ పెట్టుబడులు పెడితేనే తీవ్ర నష్టం అని హెచ్చరించారు.
బాక్సైట్ జోలికి ఖబడ్దార్ అంటూ బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి అంతకుముందు హెచ్చరించింది. మరోవైపు, బాక్సైట్ తవ్వకాల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైనా మండిపడుతున్నారు. వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ... అమరావతి భూముల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిందేం లేదని, ఇప్పుడు బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆయన ఏం చేస్తారని ప్రశ్నించారు.
కాగా, కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి గిరిజనులకు నష్టం చేసేలా బాక్సైట్ తవ్వకాలు వద్దని సూచించారు. ఇదిలా ఉండగా, బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టిన విషయం తెలిసిందే.