నీతివాక్యాలు అక్కర్లేదు: కెటిఆర్కు కిరణ్ రెడ్డి రిప్లై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు చేసిన వ్యాఖ్యకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శానససభలో తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి విభజనకు వ్యతిరేకమని ఎలా చెబుతారని కెటిఆర్ అడిగారు. దానికి ముఖ్యమంత్రి స్పందించారు.
తాను మొన్ననే చెప్పానని, తమ అధిష్టానానికి వ్యతిరేకంగా తాను ఎందుకు ఉన్నానో సభలో చెబుతానని ఆయన అన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పిన మాట వాస్తవమేనని, అయితే విభజన హేతుబద్దంగానూ సక్రమంగానూ లేదని తాను భావిస్తున్నానని, అందుకే వ్యతిరేకిస్తున్నానని ఆనయన అన్నారు.
తెరాస సభ్యుల నుంచి నీతి వాక్యాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు నష్టం జరుగుతుందని, తెలంగాణకు ఎలా నష్టం జరుగుతుందో వివరిస్తానని, ఆ తర్వాత తెరాస సభ్యులు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎలా పూడుస్తారో తాము చూస్తామని ఆయన అన్నారు.
ఆ తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లుపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి చర్చ కొనసాగించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రే చెప్పారని, మనం కూడా దాన్ని పాటిస్తే మంచిదని ఆయన అన్నారు తెలంగాణ కోరిక ఈనాటిది కాదని ఆయన అన్నారు. భూస్వాములు, పెత్తందార్ల ఆధిపత్యం కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారని ఆయన చెప్పారు. కొమురం భీమ్, ఐలమ్మ, బందగీ పోరాటాలు చేశారని, తరతరాల ఒత్తిడికి గురై తెలంగాణ ప్రజలు పోరాటాలు చేశారని ఆయన అన్నారు. హింసకు తావు లేకుండా తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశారని, అందుకు వారిని అభినందించాలని ఆయన అన్నారు.