నిధులున్న పదవులు జగన్ సామాజిక వర్గానికి, కుర్చీలు కూడా లేని పదవులు బలహీనవర్గాలకా? అచ్చెన్న ధ్వజం
టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల వైసిపి సర్కారు ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో కూడా సీఎం జగన్ వివక్ష చూపించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిధులు, అధికారాలు ఉన్న కార్పొరేషన్లను సీఎం జగన్ తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు కనీసం కుర్చీ కూడా లేని చైర్మన్ పదవులను కేటాయించారని ఆయన ఆక్షేపించారు.
వైసీపీలో రాజకీయ నిరుద్యోగులకు, తన సామాజిక వర్గంలోని వారికి పదవులు కట్టబెట్టడం పై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ విద్యావంతులైన, నిరుద్యోగులపై ఏ మాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు సీఎం జగన్ అడుగడుగునా అన్యాయమే చేస్తున్నారని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులను డమ్మీలుగా చేశారని , వారు మంత్రులుగా ఉన్నా లేనట్లే అని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు, ఉన్నత పదవులు అన్నింటినీ సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారు అంటూ ఆరోపించారు.
సామాజిక న్యాయం పేరుతో సామాజిక ద్రోహం చేస్తున్నారని విమర్శించారు అచ్చెన్న. రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో సింహభాగం తన సొంత సామాజిక వర్గంతో నింపుకోవడమే సామాజిక న్యాయమా ? అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్నిడి నిలదీశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీల రాజకీయ అవకాశాలను దెబ్బ తీశారని, సబ్ ప్లాన్ నిధులలో కోత పెట్టారని, ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాల బడుగుల అసైన్డ్ భూములను లాక్కున్నారని ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ లలో కోతపెట్టి 16,800 మంది బీసీల రాజకీయ అవకాశాలను దెబ్బ తీశారని ఆరోపించారు. ఇక ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్లు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అత్యాచారాలు, దాడులు, హత్యలకు తెగబడుతూ బడుగులకు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా చేశారని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.