బిటెక్ దొంగ అరెస్ట్...రూ.15 లక్షలు స్వాధీనం...ఉద్యోగం రాలేదని!
చిత్తూరు: అతడు బిటెక్ చదివావు. మంచి పర్సెంటీజీతో పాసయ్యాడు. బ్యాంకు ఉద్యోగం కోసమని ప్రత్యేకంగా నంద్యాలలో కోచింగ్ కూడా తీసుకున్నాడు. ఎన్ని పోటీ పరీక్షలు రాసినా జాబ్ మాత్రం రాలేదు.
దీంతో ఇలా లాభం లేదని అడ్డదారికి సిద్దమయ్యాడు. చైన్ స్నాచర్ గా మారాడు. నగల దొంగతనాలు చేస్తూ వచ్చిన దొంగ సొత్తుగా పుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు కటకటాలు లెక్క బెడుతున్నాడు. చిత్తూరు జిల్లా తిరుచానూరుకు చెందిన యువకుడి ఉదంతమిది. వివరాల్లోకి వెళితే...
ఉద్యోగం కోసం కోచింగ్...నో యూజ్
తిరుపతి క్రైం పోలీసు స్టేషన్లో డీఎస్పీ రవిశంకర్రెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం...తిరుచానూరులోని కొత్తపాలెం లేఔట్లో నివాసముంటున్న కంపా కాటయ్య కుమారుడు 29 ఏళ్ల కంపా ఈశ్వర్ కిషోర్ 2010లోనే బీటెక్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పూర్తి చేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం,బ్యాంకు జాబ్ కోసంతిరుపతి, నంద్యాలలో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఎన్ని సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఉద్యోగం రాకపోవడంతో పాటు క్రమంగా జల్సాలకు అలవాటుపడ్డాడు.
డబ్బు కోసం దొంగగా మారి...అయినా కోచింగ్ కంటిన్యూ
దీంతో డబ్బు కోసం దొంగతనాలు చేయాలని డిసైడైన ఈశ్వర్ కిషోర్ తిరుపతికి వచ్చాడు. ఆ ప్రకారమే పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మొదట హ్యాండ్ బ్యాగుల దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బులు తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయేవాడు. అయితే బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తప్పించుకోగలిగాడు. ఆ తరువాత మకాం తిరుపతికి మార్చేశాడు. ఇలా అడపాదడపా దొంగతనాలు చేస్తూనే 2013 నుంచి 2015 వరకు తిరుపతిలో ఉంటూ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇక లాభం లేదని జల్సాల కోసం డబ్బుల కోసం చైన్ స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు.
కేసులే కేసులు...కానీ ఒక్కసారి కూడా...
అలా తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి తన బైక్ పై వెంబడిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడు. తదనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జల్సాలకు అలవాటు పడిన ఈశ్వర్ కిశోరే ఇలా చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతని క్రైం రికార్డు పరిశీలిస్తే తిరుపతి క్రైం పోలీసు స్టేషన్లో 7, ఎంఆర్పల్లి పోలీసు స్టేషన్లో 7, ఎస్వీయూ పోలీసు స్టేషన్లో 2, శ్రీకాళహస్తి టూటౌన్లో ఒకటి, తిరుచానూరులో 2 మొత్తం 19 కేసులు నమోదయ్యాయి.
చివరకు దొరికాడు...ఇదే మొదటిసారి...
అంతేకాదు బిటెక్ దొంగ ఈశ్వర్ కిశోర్ నగలను అమ్మగా వచ్చిన డబ్బును జల్సా చేయడంతో పాటు వడ్డీలకు కూడా ఇచ్చేవాడని తెలిసి పోలీసులు సైతం విస్మయం చెందారు. అలా ఈ నెల 7న ఒక స్నేహితుడు డబ్బు కావాలని అడగడంతో తన వద్ద ఉన్న బంగారు నగలు అమ్మేందుకు ప్రయత్నించాడు. అప్పటికే నగల షాపుల వారిని అప్రమప్తం చేసి ఉంచిన పోలీసులు తమకు అందిన సమాచారంతో చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.13.40 లక్షలు విలువ చేసే 383 గ్రాముల బంగారు ఆభరణాలు, 422 గ్రాముల వెండి, రూ.1.70 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ నిందితుడు ఈశ్వర్ కిషోర్ ఇన్నిదొంగతనాలు చేసినా పోలీసులకు పట్టుబడటం మాత్రం ఇదే మొదటిసారని చెప్పారు. 2017లో జరిగిన 16 చోరీలపై బాధితులు అసలు ఫిర్యాదే చేయలేదన్నారు.