వెనిగళ్ల శ్రీకాంత్తో ఫోటోను చూపించిన జగన్: సవాల్ చేసిన బోడే ప్రసాద్
హైదరాబాద్: వెనిగళ్ల శ్రీకాంత్తో తాను విదేశాలకు వెళ్లినట్లు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చేసిన ఆరోపణను ఖండిస్తూ టిడిపి శాసనసభ్యుడు బోడె ప్రసాద్ మార్ఫింగ్ పొటో చూపిస్తున్నారని అన్నారు. దానికి జగన్ స్పందిస్తూ, వెనిగళ్ల శ్రీకాంత్తో బోడె ప్రసాద్ దిగిన ఫొటోను చూపించారు.
విదేశాల్లో ఉన్న ఎమ్మెల్యే తిరిగి వచ్చారని వచ్చిన వార్తాకథనాన్ని చదివి వినిపించారు. ఓ నిందితుడితో విదేశాల్లో తిరిగిన ఎమ్మెల్యే తిరిగి వస్తే కనీసం పోలీసులు ఆ ఎమ్మెల్యేను ప్రశ్నించలేదని జగన్ అన్నారు. దానికి బోడె ప్రసాద్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, తాను తప్పు చేసినట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. దీనిపై స్పందించిన జగన్ కాల్మనీ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా బోడె ప్రసాద్ను పోలీసులు కనీసం విచారించలేదని అలాంటిది దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించడమా? అంటూ ఎద్దేవా చేశారు.
గంగిరెడ్డినే ప్రభుత్వం పట్టుకుందని, వెనిగళ్ల శ్రీకాంత్ను పట్టుకోవడం కష్టం కాదని, అరెస్టు చేయకపోతే అతనే లొంగిపోతాడని బోడె ప్రసాద్ అన్నారు. కాల్మనీ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరిక ఉండేదని, కానీ ఈరోజు తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చి ఈ విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు.
తాను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాచనని తెలిపారు. నాన్నగారు, తాతగారు కోఆపరేటింగ్ బ్యాంకును అత్యంత సమర్ధవంతంగా నడిపి లాభాల్లో ఉంచిన కుటుంబం నుంచి తానొచ్చానని చెప్పుకొచ్చారు. ఒక సర్పంచ్గా క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తాను మొదట్లో 1000 ఓట్లతో ఓడిపోయానని, ఆ తర్వాత అదే సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 9వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందానన్నారు.
తన గ్రామాన్ని కోట్ల రూపాయల నిధులతో అభివృధ్ది చేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కాల్మనీ వ్యవహారంలో ఈరోజు నాపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. నేను నా కుటుంబంతో విదేశాల్లో ఉంటే, మార్ఫింగ్ చేసి తాను విదేశాల్లో జల్సాలు చేస్తున్నట్లు వైసిపి ఆరోపించిందని, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా అన్నారు.
మిత్రుడితో విదేశాలకు వెళ్తే ఆరోపణలా అన్నారు. కాల్ మనీలో తన పెట్టుబడులు ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, కానీ నేనే అప్పు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పారు. నా వద్ద డబ్బులు ఉంటే బ్యాంకు నుంచి అప్పులు తీసుకోకపోయేవాడిని అన్నారు. ప్రతిపక్ష నేత కాల్ మనీ పైన కనీసం ఫిర్యాదు చేయలదేన్నారు.
చికాగో వర్సిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చిందని, జగన్కు ఇవ్వాల్సి వస్తే అవినీతిలో డాక్టరేట్ ఇవ్వొచ్చన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి నా బిడ్డలాంటి వాడని, మంగలి కృష్ణ తనకు సోదరుడి లాంటి వాడని గతంలో వైయస్ చెప్పారని, కానీ ఇప్పుడు తాను నిందితులతో కలిసినట్లు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.