కేటీఆర్ కాళ్లు సుజన పట్టుకోలేదా?: జగన్-హరీష్ల భేటీపై బొత్స సవాల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.
అందుకు ఆధారాలుంటే తెలుగుదేశం పార్టీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స్టీఫెన్ సన్కు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని జగన్ తెరాసకు లేఖ రాసినట్లుగా తెలుగుదేశం పార్టీ నిరూపిస్తుందా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో జగన్ సమావేశమైన ఆధారాలు చూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని బొత్స సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదని చెప్పారు.
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి ఢిల్లీలో తెరాస మంత్రి కాళ్లావేళ్లా పడి బతిమాలటం నిజం కాదా అని ప్రశ్నించారు.
టీడీపీకి వైసీపీ 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని ప్రశ్నించింది.
సుజనా చౌదరిని ఢిల్లీ పంపి, అక్కడ కేటీఆర్ కాళ్లు పంటించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధమైన మాట నిజం కాదా అన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలను ఉపయోగించి ఎన్డీయే పెద్దలందర్నీ ప్రాధేయపడ్డారన్నారు.
గవర్నర్ మీద టీడీపీ నాయకులు, మంత్రులు చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పు పట్టారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, రాష్ట్రానికి సంబంధించి ఆయనతో ఏమైనా ఇబ్బంది ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు.
ఒకరేమో గంగిరెద్దు, మరొకరేమే దృతరాష్ట్రుడు అనడం విడ్డూరమన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాత్రం ఎవరినీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, అంటే రాజీ చేసుకుందామనా అని ప్రశ్నించారు. సెక్షన్ 8 అప్పుడే అమలు జరిగిందా, ఎందుకు తగ్గారని ప్రశ్నించారు.
తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి కుట్ర అంటారా అని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే రూ.50 లక్షలు లంచం ఇచ్చి, దేశ ప్రజలందరూ చూస్తూ ఉండగా పట్టుబడ్డారన్నారు.
ఏపీకి తలవంపులు తెచ్చారని, పరిపాలనను గాలికి వదిలేశారన్నారు. రైతులు అల్లాడిపోతున్నారని, వాళ్లకు కనీస మద్దతు ధరను కేంద్రం కేవలం రూ.50 మాత్రమే పెంచినా దాని పైన కనీసం టీడీపీ స్పందించడం లేదన్నారు. సంక్షేమం దూసుకెళ్లి పోతుందని చెబుతున్నారని, కానీ అవినీతిలోనే సర్కారు దూసుకుపోతోందన్నారు.
ఓటుకు నోటుపై హైకోర్టులో పిల్
ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు.