మూటలు మోసినవారి కోసమే బెజవాడ: బాబుపై బొత్స
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి మూటలు మోసినవారి కోసమే విజయవాడను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిగా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకుండా తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం అర్థరహితమని ఆయన అన్నారు.
నివేదిక వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉంటున్నదే తాత్కాలిక రాజధాని అని, మరో తాత్కాలిక రాజధాని అవసరం లేదని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని, ప్రాంతీయ విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన వారి గురించి ఆలోచించకుండా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఈ నెలాఖరులోనే రాబోతున్నప్పుడు ఇప్పుడు హడావుడిగా తాత్కాలిక రాజధానిని ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరావు సర్వజనసర్వే నిర్వహించడాన్ని ఆయన సమర్థిస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందరికో క్రిందిస్థాయి వరకూ వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వేల పేరుతో తెలుగువారికి అన్యాయం జరిగితే తాము సహించబోమని ఆయన అన్నారు.