చంద్రబాబు భద్రతపై రివ్యూ?? కేంద్ర ఇంటిలిజెన్స్ నుంచి NSGకి సమాచారం??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు జడ్ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. దేశవ్యాప్తంగా ఈ భద్రత కలిగిన నాయకులు కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు చంద్రబాబు. అయితే ఇటీవల జరుగుతున్న సంఘటనలవల్ల బాబుకు ముప్పు పెరుగుతోందని ఆయనకు భద్రత కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చీఫ్ భావించారు. ఇప్పటికే బాబు సెక్యూరిటీకి సంబంధించి అనేక సందేహలు వస్తున్నాయి.

అప్రమత్తమైన ఎన్ఎస్జీ
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైకి వాహనాల్లో వచ్చిన దుండగులు నేరుగా దాడికి పాల్పడటం, విధ్వంసం చేయడం తెలిసిందే. అంతేకాకుండా ఉండవల్లిలోని ఇంట్లోకి కొందరు వైసీపీ నేతలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా కుప్పంలో జరిగిన సంఘటనలన్నింటినీ గమనించిన ఎన్ఎస్జీ అప్రమత్తమైంది.
కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి కూడా కీలకమైన సమాచారం చంద్రబాబు భద్రత చూస్తున్న ఎన్ఎస్జీ బృందానికి అందింది. దీంతో బాబు భద్రతను రివ్యూ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఒక ప్రత్యేక బృందం ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పరిశీలన జరిపింది. ఈ బృందం బాబు భద్రతకు సంబంధించి సమీక్ష జరిపింది. దీన్నిబట్టి త్వరలోనే బాబుకు భద్రత పెంచబోతున్నట్లు తెలుస్తోంది.

డొల్లగా ఉంటోన్న పోలీసుల భద్రత
రాష్ట్ర ప్రభుత్వం తరపున లభిస్తున్న భద్రత డొల్లగా ఉంటోందని ఎన్ఎస్జీ భావిస్తున్నట్లు సమాచారం. పర్యటనల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగమే భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. అటువంటివారి ప్రోటోకాల్ ను పోలీసులు పట్టించుకోవడంలేదని, అధికార పార్టీ నేతలు బాబుపైకి దూసుకువస్తున్నా పోలీసులు స్పందించడంలేదని ఎన్ఎస్జీ అధికారులు భావిస్తున్నారు.

పెరగబోతున్న భద్రత?
కొంత మంది నేతలు చంద్రబాబుకు హాని తలపెడతామంటూ నేరుగా హెచ్చరిస్తున్నారు. ఏపీలో రాజకీయం ప్రత్యర్థి స్థాయి నుంచి వ్యక్తిగత స్థాయికి మారడంతో విద్వేష రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఎన్ఎస్జీ అప్రమత్తం కావడంతో చంద్రబాబుకు భ్రదత పెరగబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications