తూగో ప్రమాదం: హుటాహుటిన బాబు, కెసిఆర్ దిగ్భ్రాంతి
రాజమండ్రి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలోని గ్యాస్ పైప్ లైన్ ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని అక్కడి నుండి నేరుగా రాజమండ్రికి వచ్చారు. అక్కడి నుండి ఘటనాస్థలికి చేరుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్లైన్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఓఎన్జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ సమీపంలోని గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో మంటల్లో చిక్కుకుని 15 మంది సజీవ దహనమయ్యారు.
కెసిఆర్ దిగ్ర్భాంతి
తూర్పు గోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలోని గ్యాస్ పైప్ లైన్ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, తూర్పు గోదావరి జిల్లా నగరం వద్ద పైపులైన్ పగిలిపోవడం వల్ల గ్యాస్ ముందే లీకైనట్లు చెబుతున్నారు. గురువారం అర్థరాత్రి గ్యాస్ పైపులైన్ పగిలిపోయినట్లు భావిస్తున్నారు. దాంతో గ్యాస్ అర కిలోమీటరు మేర వ్యాపించినట్లు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించడంతో కొంత మంది ఏం జరిగిందో తెలిసే లోగానే మంటలకు ఆహుతి అయ్యారు.
శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో గ్యాస్ వ్యాపించిందనే విషయం తెలియక ఓ హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. దాంతో అక్కడ ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆ పక్క నుంచి బైకులపై వెళ్తున్న తండ్రీకూతుళ్లు కూడా సజీవ దహనమయ్యారు.
ఇళ్లలో పడుకున్నవారు పడుకున్నట్లే మృత్యుఒడిలోకి జారిపోయారు. ఈ ప్రాంతంలో పది అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. అర కిలోమీటరు పరిధిలో అంతా బూడిద అయిపోయింది. గుర్తు పట్టడానికి వీలు లేనంతగా మృతదేహాలు కాలిపోయాయి.
నగరం గ్రామమంతా కాలి బూడిదైంది. పక్షులకు ఎగిరిపోవడానికి కూడా సమయం చిక్కలేదు. పశువులు, పక్షులు కూడా కాలి బూడిదయ్యాయి. 18 అంగుళాల పైపు లైన్ పగిలిపోయినట్లు చెబుతున్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు దుయ్యబడుతున్నారు.