స్పీకర్ చెవిలో చెప్పాలనే: చెవిరెడ్డి, నాకు నోటీసుల వెనుక: కొడాలి సంచలనం
తమను సస్పెండ్ చేయడానికి సిద్ధమయ్యే ప్రివిలేట్ కమిటీ ముందుకు పిలిచారని వైసిపి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురువారం అన్నారు. సామాజిక సమతౌల్యం కోసమే తనకు నోటీసులు ఇచ్చారని కొడాలి నాని అన్నారు.
విజయవాడ: తమను సస్పెండ్ చేయడానికి సిద్ధమయ్యే ప్రివిలేట్ కమిటీ ముందుకు పిలిచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురువారం అన్నారు. మరోవైపు, సామాజిక సమతౌల్యం కోసమే తనకు నోటీసులు ఇచ్చారని కొడాలి నాని అన్నారు.
తమకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి, కొడాలి గురువారం నాడు ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. చెవిరెడ్డి కమిటీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
బాయ్కాట్ చేసిన చెవిరెడ్డి, స్పీకర్ చెవిలో చెబుదామనే..
చెవిరెడ్డి ప్రివిలేజ్ కమిటీని బాయ్ కాట్ చేశారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. తమను సస్పెండ్ చేయడానికి సిద్ధమయ్యే నోటీసులు ఇచ్చారన్నారు. తప్పు చేసినందు వల్లే తాము కమిటీ ముందుకు వచ్చామని కమిటీ సభ్యులు చెప్పారని, అది సరికాదన్నారు.
ప్రత్యేక హోదా గురించి శాసన సభలో మాట్లాడుదామనుకుంటే తనకు మైక్ ఇవ్వలేదన్నారు. దీంతో తాను స్పీకర్ చెవిలో చెప్పేందుకు పోడియం వద్దకు వెళ్లానని చెప్పారు. తన వాదన వినకుండానే తాను తప్పు చేసినందు వల్లే వచ్చానని ఎలా చెబుతారన్నారు.
నాకు నోటీసు అందుకే ఇచ్చారు: కొడాలి నాని
సామాజిక సమతౌల్యం కోసమే తనకు నోటీసులు ఇచ్చినట్లుగా కనిపిస్తోందని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. నోటీసులు ఇచ్చే విషయంలో కొన్ని కులాలను టార్గెట్ చేశారనుకుంటారని భావించి, తనకు కూడా ఇచ్చారన్నారు. అసలు బెంచీలను ఎక్కిన వారిని ఏం చేశారని ప్రశ్నించారు.
తనకు ఉద్దేశ్యపూర్వకంగా నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వీడియో ఫుటేజీలో తాను ఎక్కడా అభ్యంతరంగా ప్రవర్తించినట్లు లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వారి పైన ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.