చింతమనేనికి పదవి గండం?: అనర్హత వేటు తప్పదా!.. చట్టం ఏం చెబుతోంది..
Recommended Video
ఏలూరు: పాత కేసుల విచారణ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పదవికే ఎసరు పెట్టేలా తయారైంది. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్కుమార్పై, అలాగే ఆయన గన్మెన్పై దాడి చేశారు చింతమనేని. ఎంపీ కావూరి సాంబశివరావుపై కూడా చేయి చేసుకున్నారు. దీంతో అప్పట్లో 5 సెక్షన్ల కింద చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి. ఏడేళ్లుగా దీన్ని విచారిస్తున్న భీమడోలు మెజిస్ట్రేట్ బుధవారం చింతమనేనికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
సంచలన తీర్పు: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఆర్నెళ్ల జైలు శిక్ష..
పదవి ఊడుతుందా?:
కోర్టు జైలు శిక్ష విధించడంతో చింతమనేని తన విప్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి గండం ఏర్పడింది. విప్ పదవికి వెంటనే రాజీనామా చేయాల్సి ఉండగా.. ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశముంది. అయితే మెజిస్ట్రేట్ తీర్పును చింతమనేని సుప్రీం లేదా హైకోర్టుల్లో సవాల్ చేసే అవకాశముంది. ఒకవేళ అక్కడ కూడా చుక్కెదురైతే చింతమనేని జైలుకు వెళ్లక తప్పదు.
అసలేంటీ కేసు..:
2011 నవంబర్ 26న దెందులూరులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించింది. అప్పటి మంత్రి వసంతకుమార్తోపాటు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమస్యలపై మాట్లాడానికి వచ్చిన చింతమనేని మంత్రి వట్టి వసంత్కుమార్తో వాగ్వాదానికి దిగాడు.
చింతమనేని దౌర్జన్యం..:
చింతమనేని దురుసుతనంతో మంత్రికీ తనకు మధ్య మాటా మాటా పెరిగింది. చింతమనేని మంత్రిని నానా దర్భాషలాడటమే గాక వసంతకుమార్పై చెయ్యి చేసుకున్నారు. అడ్డుకోబోయిన గన్మెన్ను పక్కకు నెట్టేశారు. దీంతో గన్మెన్ ఎం.సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చింతమనేని ప్రభాకర్తో పాటు మరో 14 మందిపై అప్పట్లో దెందులూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 218 కింద కేసు నమోదు చేశారు.
పూర్తి సాక్ష్యాధారాలతోనే శిక్ష:
సహజంగానే చింతమనేనికి ఉన్న ట్రాక్ రికార్డ్ రీత్యా జిల్లా అధికారుల్లోనూ ఆయనంటే భయం. దీంతో మంత్రిపై దాడి కేసులో అధికారులెవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గత నెలలో కోర్టు ముందు హాజరై సాక్ష్యం చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోలు కూడా కోర్టు ముందుకు రావడంతో చింతమనేనికి శిక్ష తప్పలేదు.
మూడేళ్ల జైలు శిక్ష:
చింతమనేని అప్పటి మంత్రిపై దాడి చేశారన్న దానికి పూర్తి సాక్ష్యాధారులు లభించడంతో భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె.దీపదైవకృప సంచలన తీర్పు చెప్పారు. ఓ సెక్షన్లో రెండేళ్లు జైలు-రూ.1000 జరిమానా, మరో సెక్షన్లో 6 నెలలు శిక్ష-మరో రూ.1000 జరిమానా, మూడో సెక్షన్లో మరో 6 నెలలు జైలు-500 జరిమానా విధించారు.
అంటే, మొత్తం మూడేళ్ల జైలు శిక్ష. కోర్టు తీర్పుతో వెంటనే పిటిషన్ దాఖలు చేసి బెయిల్ తెచ్చుకున్నారు చింతమనేని. మున్ముందు ఆయన పై కోర్టులను ఆశ్రయిస్తే.. అక్కడ ఎటువంటి తీర్పులు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.
చట్టం ఏం చెబుతోంది:
2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అప్పటి సుప్రీం తీర్పును పరిశీలిస్తే.. చింతమనేనిపై వేటు ఖాయంగానే కనిపిస్తోంది. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఏదేని కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైతే.. తక్షణమే పదవీచ్యుతుడు అవుతాడని, జైలు శిక్ష తప్పదని పేర్కొంది. ఈ లెక్కన చింతమనేనిపై వేటు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.