రివర్స్, ఉత్కంఠ: మే 16పై జగన్ ఆశ, టిడిపికి ఆందోళన
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మే 16 నాటి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. సోమవారం వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో సీమాంధ్రలో టిడిపి జోరు స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉండగా, తెరాస రెండో స్థానంలో నిలిచింది. టిడిపి కూడా ఆశించిన స్థాయిలో గెలుపొందింది.
మంగళవారం వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో కొంత తారుమారు కనిపించింది. సీమాంధ్రలో టిడిపి ముందంజలో నిలిచినప్పటికీ మున్సిపల్ ఫలితాల్లో కనిపించిన జోరు లేదు. అలాగే తెలంగాణలోను కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ తెరాస కంటే కొద్ది స్థానాలతో మాత్రమే ముందుంది.
మొదట మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు చూస్తుంటే సీమాంధ్రలో టిడిపి జోరు కనిపిస్తున్నప్పటికీ మొదట జరిగిన మున్సిపల్ కంటే తర్వాత జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కాస్త తగ్గింది. ఆ తర్వాత జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లోను ఇలాగే మరింత తగ్గుముఖం కనిపిస్తుందా అనే చర్చ సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
జగన్ పార్టీలో ఉత్సాహం
మున్సిపల్ ఫలితాలతో ఢీలాపడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు కొంత ఉత్సాహాన్ని నింపాయి. మున్సిపల్ ఫలితాల్లో జగన్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో మాత్రం సత్తా చాటింది. అయినప్పటికీ టిడిపి కంటే వెనుకబడే ఉంది. అయితే మున్సిపల్ ఫలితాలు టిడిపి వైపు ఏకపక్షంగా ఉండగా ఈ రోజు ఫలితాలు కొంత అనుకూలంగా ఉండటంతో... రేపటి మే 16 వాటి ఫలితాలు తమకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది.
లెక్కలేస్తున్న టిడిపి
మున్సిపల్ ఫలితాలు తమ వైపు ఏకపక్షంగా ఉండగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ కంటే కొద్ది స్థానాలు మాత్రమే దూరంగా ఉండటంపై టిడిపి లెక్కలు వేసుకుంటోంది. అయితే, ఈ రెండు ఫలితాలను విశ్లేషించి చూసినా మే 16 నాటి ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని టిడిపి భావిస్తోంది.
తెలంగాణలో....
తెలంగాణలో సోమవారం నాటి మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెసు పార్టీ విజయ ఢంగా మోగించింది. తెరాస రెండో స్థానంలో నిలిచింది. టిడిపి మూడో స్థానానికి పరిమితమైంది. టిడిపి, బిజెపి కలుపుకుంటే తెరాస కంటే ముందుంది. అయితే మంగళవారం నాటి ఫలితాలు కొంత భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ తెరాస కంటే కొద్ది స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. దీని ఆధారంగా తెరాస, కాంగ్రెసు లెక్కలు వేసుకుంటున్నాయి. తెలంగాణలో టిడిపి పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ ఆ పార్టీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఊహించని ఫలితాలు సాధిస్తోంది.
కాగా, మున్సిపల్ ఫలితాల్లో సీమాంధ్రలో టిడిపి 64 మున్సిపాలిటీలు, నాలుగు కార్పోరేషన్లు కైవసం చేసుకోగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 19 మున్సిపాలిటీలు, మూడు కార్పోరేషన్లు గెలుచుకుంది. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల విషయానికి వస్తే.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు... టిడిపి దాదాపు 3000 ఎంపీటీసీలు, 42 జెడ్పీటీసీలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు 2400 ఎంపీటీసీలు, 35 జెడ్పీటీసీలు గెలుచుకుంది.
తెలంగాణ విషయానికి వస్తే.. కాంగ్రెసు 24 మున్సిపాలీటీలను గెలుచుకుంది. తెరాస 9 గెలుచుకుంది. టిడిపి ఆరింట గెలిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు మాత్రం.. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు... కాంగ్రెసు దాదాపు 1450 ఎంపీటీసీలు, 55 జెడ్పీటీసీలు, తెరాస 1186 ఎంపీటీసులు, 106 జెడ్పీటీసీలు, టిడిపి 647 ఎంపీటీసీలు, 10 జెడ్పీటీసీలు గెలుచుకుంది.