పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతారు: కెసిఆర్పై దేవినేని ఉమ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రక్రియ ఆలస్యమైతే విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెల్లిపోతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. 1957 నిబంధనను భౌగోళిక అంశాలకు కూడా వర్తింపజేస్తారా అని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు. స్థానికతను 1956ను మైలురాయిగా తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడంపై ఆయన గురువారంనాడు ఆ ప్రశ్న వేశారు.
పోలవరంపై కాంగ్రెసు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలనడం అవగాహనా రాహిత్యమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు 3,200 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని ఆనయ చెప్పారు. చత్తీస్గడ్, ఒడిషా రాష్ట్రాల్లో ముంపు జరగకుండా గోడ కడుతామని ఆయన చెప్పారు.
స్థానికతపై నిర్ణయం తీసుకోవడానికి కెసిఆర్ ఎవరని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. లోకల్, నాన్లోకల్ అనే విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలో ఉందని ఆయన గురువారం మీడియాతో అన్నారు. స్థానికతపై కేసీఆర్ 1956ను కటాఫ్గా తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అమలు తెలంగాణ ప్రభుత్వ ఇష్టమన్న మంత్రి గంటా స్థానిక త అంశంపై కేసీఆర్ స్థాయి మరిచి ఉద్యమనాయకుడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన చట్టానికి అనుగుణంగా పదేళ్ల ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కేసీఆర్ సహకరించాలన్నారు. తమ రాజధాని గురించి కేసీఆర్కు ఎందుకని మంత్రి గంటా అన్నారు.