డైలామాలో కంభంపాటి.. : పదవిని పొడగిస్తారా..? పక్కనబెట్టేస్తారా..?
న్యూఢిల్లీ/విజయవాడ : పదవీకాలం పూర్తయి నెల రోజులకు దగ్గరికొస్తున్నా..! పార్టీలో తన స్థానంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావులో ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది.
గత నెల 17వ తేదీతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిథిగా కంభంపాటి పదవీకాలం ముగిసింది. కాగా, ఆ పదవికి మరో ముగ్గురు నేతలు కూడా పోటీ పడుతున్నట్టు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన పదవిని రాష్ట్ర ప్రభుత్వం పొడగిస్తుందా.. లేక ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తుందా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను చక్క బెట్టడానికి అధికార ప్రతినిధి పదవిని పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. జాతీయ నేతలతో రాష్ట్ర కార్యవర్గం సమావేశాలు ఖరారు చేయడంలో, రాష్ట్ర స్థితి గతుల గురించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేరవేయడంలో అధికార ప్రతినిధులదే కీలక పాత్ర. ఈ ఉద్దేశంతోనే ఢిల్లీలో చంద్రబాబు వ్యవహారాలను చాలాకాలంగా చక్కదిద్దుతూ వస్తోన్న కంభంపాటిని అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు సీఎం చంద్రబాబు.
కాగా, ప్రస్తుతం ఆయన పదవి కాలం ముగిసిపోవడం, పార్టీ రాజ్యసభ బెర్తుల్లోను ఆయనకు చోటు దక్కకపోవడంతో ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఆయన పదవికాలాన్ని పొడగించాలని కోరుతున్నారు కంభంపాటి. అయితే ఇదే పదవికి చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి, స్కిల్ డెవలప్మెంట్ డైరక్టర్గా కొనసాగుతున్న కె.లక్ష్మీనారాయణ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా సుబ్బారావు, ఐటి సలహాదారు జె.సత్యనారాయణ పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో కంభంపాటి పదవి పొడగింపుపై డైలామా కొనసాగుతోంది.
అయితే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవిని చాలా కాలంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారికి కేటాయిస్తూ వస్తుండడంతో, ఈ దఫా వేరే సామాజిక వర్గానికి చెందినవారికి పదవిని కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. ఈవిధంగా చూసిన కంభంపాటి పదవి పొడగింపుపై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. దీంతో కంభంపాటి పదవిని సీఎం చంద్రబాబు పొడగిస్తారా..? లేక వేరే వ్యక్తులకు అవకాశం ఇస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.