తుది దశకు మేయర్ హత్య కేసు: చింటూ ఇంట్లో రూ.40 కోట్ల పత్రాలు
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసు తుది దశకు చేరుకుందని, మరికొందరి అరెస్టు తప్పదని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మేయర్ దంపతుల హత్య కేసును 90 శాతం చేధించామని చెప్పారు. త్వరలోనే కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు.
తనను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినందునే మేయర్ దంపతులను చంపినట్లు చింటూ అంగీకరించాడని చెప్పారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, నేర ప్రవృత్తి లాంటి సెక్షన్ల కింద చింటూప నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. అవసరమనుకుంటే కస్టడీకి తీసుకుంటామని చెప్పారు.
చింటూ ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేశామన్నారు. హత్యకేసుతో ప్రత్యక్ష సంబంధాలున్న ఇరవై మందిని, చింటూకు పరోక్షంగా సహకరించిన ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. మరికొందరిని విచారిస్తున్నట్లు చెప్పారు. మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయన్నారు.
టెండరుల్లో పోటీపడుతూ, కాంట్రాక్టు పనుల్లో అడ్డుపడుతూ, రాజకీయంగా ఎదగనీయలేదనే కారణంతోనే మేనల్లుడు చింటూ చిత్తూరు నగర మేయర్ దంపతులను హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యిందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
చింటూ అనుచరులు మున్సిపల్ కార్యాలయంలో రహస్యంగా వీడియోలను చిత్రీకరించి, వాటి ఆధారంగా హత్యకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎస్పీ చెప్పారు. చింటూ, వెంకటాచలపతి బురఖా ధరించి కార్యాలయంలోనికి వెళితే, మంజు, జయప్రకాష్, వెంకటేష్ సాధారణ ఫిర్యాదుదారుల్లా వారి వెనుక వెళ్లారన్నారు.
చింటూను స్థానికంగా ఉన్న వ్యక్తులు అడ్డుకుంటే అతను బురఖాను తొలగించి, తాను చింటూ అని తెలియజేస్తూ లోనికి వెళ్లాడని, ఆపై వెంటనే మేయర్ అనురాధపై తుపాకీ ఎక్కుపెట్టి కాల్చి చంపాడని, ఆ తర్వాత మోహన్పై కూడా తూటాను వదిలాడని, అతను తప్పించుకొని పారిపోయాడని చెప్పారు.
మోహన్ లోనికి వెళ్లాడని, చింటూతో వచ్చిన మరో ముగ్గురు మోహన్పై కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన వెంటనే ఐదుగురు కార్యాలయంలోని ప్రహరీను దూకగా, అందులో ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు.
చింటూ, వెంకటాచలపతిలు మాత్రం అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్న మురుగాతో వెళ్లారన్నారు. ఇలా వెళ్లిన వారు గంగాధరనెల్లూరు మీదుగా తిరుత్తణికి వెళ్లి మురుగాను పంపించేసి వెల్లూరు, కృష్ణగిరి వైపుగా బెంగళూరుకు చేరుకున్నారని వివరించారు.
ఆ తర్వాత మైసూర్, ఊటీ, ఆపై ముల్బాగల్కు వెళ్లారని చెప్పారు. చివరగా చింటూ నవంబరు 24న పుంగనూరుకు చేరుకుని, స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలంలోని షెడ్డులో తలదాచుకున్నాడని చెప్పారు. స్థానికంగా ఉన్న ఆనంద అనే న్యాయవాది సాయంగా కొంతమంది కుర్రాళ్ల సాయం తీసుకున్నట్లు తెలిపారు.
అదే నెల 30న లోకేష్ అనే యువకుని సాయంగా బైక్ పైన పుంగనూరు నుంచి చిత్తూరుకు వచ్చి కోర్టులో లొంగిపోయినట్లు ఎస్పీ వివరించారు. అతన్ని కస్టడీకి తీసుకుని విచారించగా పలు అంశాలు వెలుగు చూశాయన్నారు.
ఈ కేసుకు సంబంధించి సోదాల్లో 7 తుపాకుల ఉపయోగించినట్లు తెలిసిందని, ఇప్పటి వరకు ఆరు తుపాకులు, 32 రెండు రౌండ్లను, 13 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
చింటూ ఇళ్లల్లో సోదాలు చేసి కత్తులు, సీసీ కెమెరా పుటేజీలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా సుమారు రూ.30 నుంచి రూ.40 కోట్లకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిపై ఈడీ, ఐటీ విభాగాలు దృష్టి సారించాయన్నారు.
కాగా, మేయర్ దంపతుల హత్యలో రిమాండులో ఉన్న నాగరాజును ఐదు రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం సోమవారం నాడు అంగీకరించింది. ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న యోగానంద్, కమలాకర్ బెయిల్ పిటిషన్లను కోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది.